నిజామాబాద్, జూలై 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అక్రమాలకు పాల్పడ్డాడు. దొంగ హాజరు శాతాన్ని చూపించి బిల్లులు లేపి జేబులు నింపుకున్నాడు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను బెదిరించి ఈ తతంగం చేసినట్లుగా సమాచారం. గడిచిన ఏడాదిన్నర కాలంలో 10వేల మధ్యాహ్న భోజనాలకు తప్పుడు లెక్కలు చూపించారు. రోజువారీగా పది నుంచి 20 మంది పిల్లలు ఎక్కువగా తిన్నట్లుగా రికార్డుల్లో రాయించి పథకం ప్రకారం చేశారు.
మధాహ్నా భోజనం తిన్నది కొద్ది మంది విద్యార్థులే అయితే అనేక మంది తిన్నట్లుగా బిల్లులు పొందడం ద్వారా సంబంధిత బాధ్యుడు భారీగా లబ్ధి పొందాడు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల అకౌంట్లలో జమ అయ్యే డబ్బును విత్డ్రా చేయించి అప్పనంగా జేబులో వేసేయడంతో అడ్డంగా దొరికినట్లు తెలుస్తోంది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు రాగా విచారణ చేయించారు. కొన్ని నెలలుగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా దర్జాగా నడుస్తోన్న అక్రమాల వ్యవహారం శిక్షణ ఐఏఎస్ అధికారి(ట్రైనీ కలెక్టర్) సురేష్ విచారణతో వెలుగులోకి వచ్చింది. రికార్డులు తారుమారు కావడం, తప్పుడు సమాచారం పొందు పర్చడం, ఉద్దేశపూర్వకంగా పిల్లల హాజరును పెంచి చూపించడం వంటివి నిర్ధారణ జరిగినట్లు తెలుస్తోంది.
మోడల్ స్కూల్లో అవినీతి, అక్రమాలకు తోడుగా చెట్ల నరికివేత కూడా యథేచ్ఛగా జరిగింది. ఆదర్శ పాఠశాల ఆవరణను పచ్చదనానికి ప్రతీకగా మార్చి ఎంతో మందికి స్ఫూర్తిని అందించాల్సి ఉండగా సదరు వ్యక్తి ఏకంగా చెట్లను నరికి వేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఏపుగా ఎదిగిన చెట్లను నరికించడానికి కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ కుటిల బుద్ధిని ప్రవర్తించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
మోడల్ స్కూల్లో చెట్లను నరికి వేయించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. మోడల్ స్కూల్ను అభివృద్ధి పథంలో నడిపించి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాల్సిన చోట అక్రమ తోవ పట్టడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పేద విద్యార్థులకు ఆకలి చదువులు ఉండొద్దనే కారణంతో తీసుకు వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని కొంత మంది తమ జేబులు నింపుకునేందుకు పాకులాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, అవినీతి సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
లేని హాజరు శాతాన్ని పెంచి చూపించడం ద్వారా మోడల్ స్కూల్ బాధ్యుడు అప్పనంగా క్వింటాళ్ల కొద్ది బియ్యం, కోడి గుడ్లు మెక్కేశాడు. దాదాపుగా 10వేల వరకు మధ్యాహ్న భోజనాల పేరిట సుమారుగా రూ.2లక్షల వరకు అవినీతి సొమ్మును కాజేసినట్లుగా తెలిసింది. క్లాస్ టీచర్లతో ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా సంతకాలు తీసుకుని, రిజిష్టర్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టి గోల్మాల్ చేసినట్లుగా విచారణ అధికారి గుర్తించినట్లు తేలింది. మహిళా బోధకులను ఇష్టారీతిన బెదిరింపులకు పాల్పడి మెమోలు జారీ చేస్తానని చెప్పి బిల్లులు స్వాహా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో శిక్షణ ఐఏఎస్ అధికారి సురేష్ తన విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది.
మోడల్ స్కూల్లో జూలై 1న విచారణ చేపట్టి సిబ్బందిని లోతుగా విచారించి కీలక సమాచారం రాబట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన పాత్రధారి ఎవరో తేటతెల్లమవ్వగా చర్యలకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగికి వంత పాడిన ఓ మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలకు బాధ్యుడిగా తేలిన వ్యక్తికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ కాగా త్వరలోనే చర్యలు తీసుకుంటారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆదర్శ పాఠశాలలో అవినీతి వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.