బాన్సువాడ, ఆగస్టు 7: కొలిక్కిరాని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, భూ పంచాయితీలు, వ్యాపారం, అప్పులు , వ్యక్తిగత విభేదాలు తదితర సమస్యలతో కోర్టు మెట్లు ఎక్కిన కేసులు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉండడం సర్వసాధారణంగా మారింది. కొన్ని కేసుల్లో సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపడంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు (కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రం) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో శాంతి, సామరస్య పూర్వక వాతావరణ పరిస్థితులను నెలకొల్పడం ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యం. బాధితులు కోర్టు విచారణకు వెళ్లకుండా, తటస్థమైన మీడియేటర్ సమక్షంలో ఇరుపక్షాలతో స్వచ్ఛందంగా చర్చించి పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరిస్తారు. ఇందులో ఎలాంటి బలవంతమూ ఉండదని , ఇరువర్గాల సమ్మతితోనే జరుగుతుందని మీడియేషన్ సెంటర్ల వలంటీర్లు చెబుతున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో 2025 ఏప్రిల్ 7న ఐదుగురు సభ్యులతో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్కు ఇప్పటి వరకు సుమారు 180 బాధితులు రాగా, ఇందులో 140 మంది సమస్యలకు పరిష్కారం చూపారు.
బాన్సువాడలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్కు పదుల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. కుటుంబ కలహాలు, పొరుగువారితో తగాదాలు, భూ సరిహద్దులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి పంపకాలు , భార్యాభర్తల మధ్య విభేదాలు, సీనియర్ సిటిజన్ వారి తదతర సమస్యలపై మీడియేషన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సెంటర్లలోని సభ్యులు విభేదాలను దూరం చేయడం, ఇరువర్గాలను కూర్చోబెట్టి ఇరువర్గాలకు బలవంతం లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నారు.
బాన్సువాడలో ఇప్పటి వరకు సుమారు 160 కేసులు రాగా, ఇందులో భార్యాభర్తల మధ్య విభేదాలు 126, అప్పులు తీసుకొని చెల్లించకపోవడం వంటి కేసులు 5, సీనియర్ సిటిజన్స్కు చెందినవి 20 కేసులు వచ్చాయి. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య ఆస్తి పంపకాల కేసులు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు 140 వరకు కేసులకు సత్వర పరిష్కారం చూపారు. అలాగే బీర్కూర్, బాన్సువాడ బీసీ వసతిగృహాల్లో యువతకు రోడ్డు భద్రత, డ్రగ్స్ వాడడంతో వచ్చే అనర్థాలను వివరిస్తున్నారు.
కోర్టు తీర్పు కన్నా సామరస్యపూర్వక పరిష్కారమే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రత్యేకత. ఇరుపక్షాలు స్వచ్ఛందంగా అంగీకరించే పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇరువర్గాల వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కోర్టు గడప ఎక్కకుండా పరిష్కారం పొందేలా అవకాశం ఉంటుందని వివరిస్తున్నాం.
-పుష్పలత, పారాలీగల్ వలంటీర్, రిటైర్డు హెచ్ఎం
బాన్సువాడ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ నిర్వహణ పారదర్శకతను చాటుకుంటున్నది. ఇరువర్గాల బాధితులు కోర్టు మెట్లు ఎక్కకుండా వారి సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా వలంటీర్లు ప్రతి బుధ, శనివారాల్లో సమయం కేటాయించి బాధితుల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నారు. వలంటీర్ల సేవలు అభినందనీయం?
-రవీందర్రెడ్డి, ఆర్డీవో