వేల్పూర్, ఫిబ్రవరి 22 : వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం అక్కడి వారు ఇటు.. ఇక్కడి వారు అటు వెళ్లలేని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వంతెనలను దాటే పరిస్థితి.. ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాగులపై కొత్త వంతెనలు నిర్మాణానికి నోచుకున్నాయి. ప్రస్తుతం వేల్పూర్ పెద్దవాగు, మోతె కప్పల వాగులపై నూతన వంతెనల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. వాగులపై హైలెవల్ వంతెనలను నిర్మించాలని గత పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
వేల్పూర్ పెద్దవాగు, మోతె కప్పల వాగుపై ఉన్న వంతెనలు పాతవి కావడంతో వర్షాకాలంలో వంతెనలపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రతి వర్షాకాలంలో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. వంతెనలకు ఇరువైపులా సైడ్వాల్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి.రెండు వాగులపై హైలెవల్ వంతెనలు నిర్మించాలని మోతె, వేల్పూర్ గ్రామస్తులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి విన్నవించారు. మంత్రి తక్షణమే హైలెవల్ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వేల్పూర్ పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి రూ.15కోట్లు, మోతె కప్పల వాగుపై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరు చేయించారు.
రెండు వాగులపై వంతెనల నిర్మాణం పూర్తయ్యింది. ఇక వర్షాకాలంలో వాగులోకి ఎంత వరద వచ్చినా రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటామని రెండు గ్రామాల ప్రజలు అంటున్నారు.