డోంగ్లీ, అక్టోబర్ 22 : దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ, హస్గుల, పెద్ద తక్కడపల్లి, దౌల్తాపూర్ గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా దౌల్తాపూర్ గ్రామంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గొల్ల కుర్మలు గొంగడి కప్పి గొర్రె పిల్లను బహూకరించారు. అనంతరం గ్రామంలోని బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమైక్య పాలనలో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 40 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చేసి చూపించామన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. బిచ్కుందలో రహదారులను విస్తరించడంతోపాటు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేలా తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాల్చర్ రాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావ్ దేశాయ్, రైతు సేవా సహకారం సంఘం అధ్యక్షుడు నాల్చర్ బాలు శ్రీహరి, ఏఎంసీ చైర్మన్ నాగనాథ్ పటేల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బసవరాజ్ పటేల్, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.