కాంగ్రెస్లో ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు
పలు నియోజకవర్గాల్లో నేతల కుమ్ములాటలు
తాజాగా లింగంపేట మండలం కోమట్పల్లిలో నాయకుల స్ట్రీట్ ఫైట్
రచ్చరచ్చగా మారిన రచ్చబండ కార్యక్రమం
పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్న రెండు వర్గాలు
ఎలారెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతోన్న కోల్డ్ వార్
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్’తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయకుల ఆధిపత్య పోరు.. తన్నులాటకు దారి తీసింది. పరస్పరం కొట్టుకున్న నేతలు ఒకరిపై మరొకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో నేతలే తన్నుకోవడం చూసి కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. టీపీసీసీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్మోహన్రావు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వడ్డెపల్లి సుభాష్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అలాగే, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కామారెడ్డిలో పోటీ చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఇటీవల ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఇక, షబ్బీర్కు వ్యతిరేకంగా మదన్మోహన్ కామారెడ్డిలోనే జాబ్మేళాను నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ప్రకటించడం విభేదాలను బయట పెట్టింది. తాజాగా లింగంపేటలో నాయకులు తన్నుకోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
కామారెడ్డి, మే 24 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారుతున్నది. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలని చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ వర్గవిభేదాలు అడ్డుతగులుతున్నాయి. రచ్చబండ వేదికగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. అంతర్గత కలహాలతో గ్రామాల్లో ఉన్న కాస్త క్యాడర్ సతమతమవుతున్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇరువర్గాలు దూషించుకుంటూ పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.
ఎల్లారెడ్డి కాంగ్రెస్లో కొరవడిన సమన్వయం…
గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్మోహన్రావు రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మదన్ మోహన్ యూత్ ఫోర్స్ పేరిట సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు గత నెలలో మీడియాకు ప్రకటించడంతో ఇప్పటికే విబేధాలు బహిర్గతం అయ్యాయి. పార్టీ పరంగా కాకుండా సొంతంగా కార్యక్రమాలను నిర్వహించడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి ఏడాది పాటు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడం సంచలనం రేపింది. దీంతో మదన్ మోహన్ రావు వర్గం సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు చేసింది. అంతలోనే రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని అధిష్టానం ప్రకటించడంతో ఈ వివాదం కొలి క్కి రాలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ ఐటీ సెల్ కన్వీనర్ కే.మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి సూచించింది. కానీ రచ్చబండ కార్యక్రమం ఎవరికి వారే నిర్వహిస్తుండడంతో చినికి చినికి గాలివానలా తయారైంది.
మదన్ మోహన్రావు వర్గానికి చెందిన లింగంపేట మండల పార్టీ అధ్యక్షుడు నల్లమడుగు షరీఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఐలాపూర్, రాంపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించా రు. అనంతరం కోమట్పల్లి నిర్వహించేందుకు వెళ్లారు. కోమట్పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాయిలు.. వడ్డ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గం కావడంతో తమ గ్రామంలో రచ్చబండ నిర్వహించవద్దని స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అక్క డి చేరుకున్న సుభాష్ రెడ్డి వర్గీయులు, మదన్ మోహన్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పరుష పదజాలంతో దుషించుకున్నారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. తనను కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి వైస్ ఎంపీపీ నర్సింహులు మదన్మోహ న్ వర్గానికి చెందిన నల్లమడుగు షరీఫ్పై లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను దూషించారని ముస్తాపూర్ గ్రామానికి చెందిన మాలకమ్మరి సిద్ధు అనే కార్యకర్త సుభాష్ రెడ్డి అనుచరులపై ఫిర్యాదు చేశారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్…మూడు ముక్కలాట
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుచరుడిగా ఉన్న వడ్డేపల్లి సుభాష్రెడ్డి ఎల్లారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిగా, పార్టీ కో-ఆర్డినేటర్గా కొనసాగుతున్నారు. ఆయనకు మాజీ మంత్రి షబ్బీర్ అలీతోనూ సాన్నిహిత్యం ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేసిన మదన్మెహన్ రావు కొంతకాలంగా ఆయా మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జమునా రాథోడ్ సైతం ఎల్లారెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ పార్టీ మరింత నలిగిపోతుంది.
మార్చి నెలలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిలో బహిరంగసభ నిర్వహించిన సమయంలో సైతం గ్రూపు విబేధాలు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటనకు రెండు రోజుల ముందే ఎల్లారెడ్డితోపాటు పలు మండలాల్లో ఫ్లెక్సీల చించివేతతో మొదలైన విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కామారెడ్డిలో రెండు దశాబ్దాలుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న తనను కాదని, మదన్మెహన్ రావు ప్రత్యేక ఆఫీసును తెరవడంపై షబ్బీర్అలీ కన్నెర్ర చేశారు. షబ్బీర్ అలీకి పోటీగా క్యాడర్ ఏర్పాటుతో పాటు కామారెడ్డిలో ఇటీవలే మదనన్న పేరుతో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ను ఆహ్వానించడం మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆగ్రహానికి మరో కారణమైం ది. దీంతో వీరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. తన అనుచరుడిగా ముద్రపడిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రోత్సహిస్తుండడంతో మదన్మోహన్ రావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు
కామారెడ్డి జిల్లాలో గ్రూపు తగాదాలను పెంచి పోషించడంతో పాటు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గీయులు ఇప్పటికే మదన్ మోహన్ రావుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమం, లింగంపేట మండలంలో నిర్వహించిన కల్లాలకు కాంగ్రెస్ యాత్ర, ఎల్లారెడ్డిలో నిర్వహించిన మన ఊరు-మన పోరు బహిరంగసభలకు మదన్ మెహన్ రావు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించారని ఫిర్యాదులు చేశా రు. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుభాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావుపై మదన్ మోహన్ వర్గం ఫిర్యాదులు చేసింది. గతంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయడు ఇలియాస్కు వ్యతిరేకంగా మదన్మోహన్ రావు వర్గం పని చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకరిపై మరొక వర్గం తరుచూ ఫిర్యాదులు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీలో తరచూ విబేధాలు తలెత్తడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.