నిజామాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి : ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరించారు. వీరికి ఎన్నికల అధికార యంత్రాంగం వంత పాడడం కామారెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకున్నది. ఆది నుంచి వివాదాస్పదంగా మారిన పీసీసీ చీఫ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి వ్యవహారం పోలింగ్ రోజున మరోసారి వివాదాస్పదమైంది. దగ్గరుండి అనుచరులతో పోలింగ్ బూతుల్లోకి వెళ్లి హల్చల్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇదంతా కండ్ల ముందే జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికార యంత్రాంగం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్లోకి కొండల్ రెడ్డి ఏకంగా వాహనంతో లోనికి వెళ్లడం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ బూత్కు 100 మీటర్ల వెలుపలే వాహనాలను వదిలి వెళ్లాలి. ఈసీ అనుమతించిన వాహనాలు మినహా ఎవ్వరూ 100 మీటర్ల పరిధిలోనికి వెళ్లకూడదు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు మాత్రం యథేచ్ఛగా వాహనంతో పోలింగ్ బూత్లోకి వెళ్లినా పోలీసులు ఇసుమంతైనా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
కామారెడ్డి పోలీసుల ద్వంద్వ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలు పోటీ చేస్తుండడంతో పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మొదటి నుంచి గొడవలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కుయుక్తులకు దిగి అడ్డంగా నోట్ల కట్టలతోనూ కామారెడ్డిలో హస్తం పార్టీ నేతలు దొరికారు. ఇది జరిగిన 24గంటల్లోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సైతం ఉల్లంఘించినా సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేసింది. సామాన్యులు ఓటేసేందుకు వచ్చినప్పుడు వెంట సెల్ఫోన్లు తెచ్చుకుంటేనే పోలీసులు ఇబ్బందికి గురి చేశారు. పోలింగ్ బూత్ బయట వేరే వారికి సెల్ఫోన్ అప్పగిస్తామని సర్ది చెప్పినా వినిపించుకోకుండా కఠినంగా వ్యవహరించారు. అలాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి తమ్ముడు ఏకంగా వాహనంతో వస్తుంటే రెడ్ కార్పెట్ వేసినట్లుగా మున్సిపల్ ఆఫీస్ గేట్లు తీసి లోనికి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్కడ పని చేస్తున్న ఖాకీలకు అంతగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? అన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి.
కండ్ల ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుంటే పోలీసులు, ఎన్నికల అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోక పోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ పోలింగ్ బూత్లో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకుడు నిట్టు వేణుగోపాల్ స్వయంగా ఈ తతంగాన్ని గమనించి కొండల్ రెడ్డిని నిలదీశారు. ఏ అర్హతతో కామారెడ్డిలో సంచరిస్తున్నావని ప్రశ్నల వర్షం కురిపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని రూల్స్ ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లలో తిరిగేందుకు నువ్వేమైనా అభ్యర్థివా? అంటూ నిట్టు వేణుగోపాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. నిట్టు అడిగిన ప్రశ్నలకు కొండల్ రెడ్డి సమాధానాలు చెప్పలేకపోయారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి నిజాంసాగర్ చౌరస్తాలోని బాయ్స్ స్కూల్కు చేరిన కొండల్ రెడ్డి అక్కడ కూడా తన అనుచరులతో హల్ చల్ చేసే ప్రయత్నం చేశారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులను వెంటేసుకుని పోలింగ్ బూత్లకు వెళ్తున్న కొండల్ రెడ్డిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అడ్డుకున్నారు. ఇదేం పద్ధతి అంటూ పోలీస్ అధికారులను అడిగారు.
త్రిబుల్ రైడింగ్ చేస్తే ఫైన్లు వేసే పోలీసులకు ఎన్నికల ఉల్లంఘనలు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించగా ఖాకీలు సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి తమ్ముడిని అక్కడ్నుంచి తప్పించి తన వాహనంలోకి సురక్షితంగా ఎక్కించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలంతా ఈ తంతును గమనించి కొద్ది సేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, నిట్టు వేణుగోపాల్ మాట్లాడుతూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడనే భయంతో కాంగ్రెస్ నాయకులు చిల్లర వేషాలు వేస్తున్నారని అన్నారు. కొడంగల్ నుంచి రౌడీ మూకలను రప్పించి కామారెడ్డిలో కల్లోలం సృష్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరని ఇలాంటి ఆరాచకపు పనులు చేస్తే ప్రజలు సహించరని కేసీఆర్ గెలుపుతో కాంగ్రెస్ నాయకులకు బుద్ది చెబుతారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో చిచ్చుపెడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్ ఇలాంటి నీచ రాజకీయాలు కామారెడ్డిలో చెల్లవని స్పష్టం చేశారు. కేసీఆర్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. రేవంత్ను కామారెడ్డి నుంచి సాగనంపే రోజు దగ్గరలోనే ఉందన్నారు.