కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ధాన్యం సేకరణ ప్రారంభించక పోవడంతో అన్నదాతల రెక్కల కష్టం దళారుల పాలవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ఊపందుకుంటున్నాయి. అయినా ధాన్యం సేకరణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా పల్లెల్లో వాలిపోతున్న దళారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. మద్దతు ధర కన్నా తక్కువకే వడ్లు కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో అన్నదాతలు దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ఊపందుకుంటున్నాయి. బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. అయితే, కనీస మద్దతు ధరకు అమ్ముదామనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కొనుగోలు కేంద్రాల విషయమై ఇంత వరకు అతీగతీ లేదు. రోజురోజుకూ వరి కోతలు పెరుగుతుండడంతో ధాన్యం రాక మొదలైంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కాక రైతన్నలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు వర్తకులంతా సిండికేట్గా మారి అందిన కాడికి దోచుకుంటున్నారు. రూ.2వేలలోపే క్వింటా ధాన్యాన్ని కొంటుండడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. వాస్తవానికి వరి గ్రేడ్ ఏ రకం క్వింటాకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణకు ముందుగానే ఏర్పాట్లు జరిగేవి. పంట కోతలు ప్రారంభమయ్యేలోపు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ధాన్యం సేకరణపై నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ఇటీవల సన్నాహక సమావేశం జరిగింది. కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాత్రం కొలిక్కి రాలేదు. ఇక, కామారెడ్డిలో అయితే కనీసం ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.
నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.13 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం 1.66 లక్షల హెక్టార్లలో సాగైంది. సుమారు 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గంగాకావేరి రకం కాగా, మిగిలిన 4.15 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యం వస్తాయని భావిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు చేయగా, మిగిలిన ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా వారం క్రితం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు వెల్లడించారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యంలో 417, ఐకేపీ ద్వారా 39, మెప్మా ద్వారా 6 కేంద్రాలు కొనసాగించేందుకు నిర్ణయించారు. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో కోతలు షురూ అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇంత వరకు ఒక్కటంటే ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాలేదు. రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి, చందూర్, రుద్రూర్ మండలాల్లో పంట కోతలు వేగంగా జరుగుతున్నాయి. ధాన్యం భారీగా వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు.
కామారెడ్డిలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పైపై నివేదికల రూపకల్పన మినహా సన్నాహక సమావేశమే జరుగలేదు. పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్కు అదనంగా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పోస్టును అప్పగించారు. ఇలాంటి కీలక పరిస్థితిలో ఒక అధికారి రెండు బాధ్యతలు అప్పగించడం, ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా చేపడతారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రొటోకాల్ అంశాలు మినహా ఇక్కడి ప్రజాప్రతినిధులకు కనీసం రైతుల బాధలను పట్టించుకునే ఆసక్తి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి ఇబ్బందులను ఆలకించే నాథుడు కూడా లేకుండా పోయాడు. ఓవైపు భూగర్భ జలాలు పడిపోవడం, సాగునీరందక పంటలు ఎండిపోతున్న తరుణంలో.. చేతికొచ్చిన వడ్లను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు.
అధికారంలోకి వస్తే వరి క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి వంద రోజులు పూర్తవడం, ధాన్యం రాక మొదలైన తరుణంలో ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. మరోవైపు, బోనస్ అంశాన్ని పక్కదారి పట్టించేలా ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువగా పంట కొనుగోళ్లు జరిగితేనే బోనస్ ఇస్తామని బుకాయిస్తున్నారు. మరోవైపు, లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్ర సర్కారు బోనస్ విషయంలో తప్పించుకున్నట్లయింది.