సారంగాపూర్, ఆగస్టు 12: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి వంటివి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలు మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలం వ్యాధులకు, డెంగ్యూ, వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలన్నారు. పేషెంట్లకు వైద్యులు అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని వున్న మంచినీటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనులలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా వైద్యాధికారి సుజాత, తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపిడివో నీరజ, ఎంపిఓ సలీమ్, ఆర్ఐ వెంకటేష్, వైద్యాధికారి రాధ రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.