బిచ్కుంద, ఏప్రిల్ 29: వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వారిని ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి బిచ్కుంద, పిట్లం మండలాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పోచారం మాట్లాడారు. కాంగ్రెస్ హామీలను నమ్మి జనం మోసం పోయారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం పెడతామన్నారు. 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. క్వింటాల్కు రూ.500 బోనస్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఫ్రీ బస్ మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు పంద్రాగస్టు లోపు చేస్తామని చెప్పడం ఓట్ల కోసమేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన తమను ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఎక్కడకు పోయినా దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో కల్యాణలక్ష్మి, పింఛన్లు, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్దని స్పష్టం చేశారు. మరి రైతులు, ప్రజల కోసం కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. బుద్ధి తక్కువ మాటలు చెప్పేవాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అనిల్కుమార్, షిండేతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాగమడుగును పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మన బతుకులు బాగు పడాలంటే బీఆర్ఎస్ రావాలని, కేసీఆర్తోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.