మే 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు అధికారులు స ర్వం సిద్ధం చేశారు. దాదాపు మూడేండ్ల తర్వాత పరీక్షలను నిర్వహించేందుకు నోడల్, ఇంటర్ విద్యాశాఖ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. కామారెడ్డి జి ల్లా వ్యాప్తంగా సుమా రు 22 వేల మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. వీరి లో జనరల్, ఒకేషనల్కు చెందిన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 10,698 మంది, ద్వితీయ సంవత్సరానికి 10,036 మంది ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 సెంటర్లను ఏర్పాటు చేయగా కామారెడ్డి పట్టణంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 41 మంది చీఫ్ సూపరింటెండెంట్లు 41 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఐదుగురు సిట్టింగ్ స్కాడ్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. జీపీఆర్ఏ సిస్టమ్ ద్వారా మూడు సెట్లను పోలీస్స్టేషన్లో భద్రపరచనున్నారు. దీనికి ఐదుగురు కస్టోడియన్స్ ఉంటారు. సుమారు 1200మంది పైగా ఇన్విజిలేటర్లు ఇంటర్ పరీక్షల విధులు నిర్వర్తించనున్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఎదుటే ప్రశ్నాపత్రాలను విడుదల చేయడం, సమాధాన పత్రాలను సీల్ చేయడం వంటివి కొనసాగుతాయి. మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలలో ఇప్పటికే సీసీ కెమెరాలు బిగించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రశ్నాపత్రాలను పరీక్షలకు మూడు,నాలుగు రోజులు ముందుగా కేంద్రాలను ఏర్పాటు చేసిన పట్టణాలు, మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి సరఫరా చేసే బాధ్యత కస్టోడియన్లకు అప్పగిస్తారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు సెంటర్ లొకేటర్ యాప్ను రూపొందించారు. హాల్టికెట్ నంబర్ నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉన్నది..అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు..
ఇంటర్ పరీక్షల దృష్ట్యా నిర్వహణ కేంద్రాల వద్ద బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక కానిస్టేబుల్ను నియమించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షకు అరగంట ముందు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఒక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించరు. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం 8గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మాస్కాపీయింగ్ జరగకుం డా అన్ని చర్యలు తీసుకున్నాం. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించం. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి.
-షేక్ సలాం, ఇంటర్మీడియేట్ జిల్లా నోడల్ అధికారి