వర్ని, సెప్టెంబరు 12 : నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకూ సరిపడా నీరందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. వర్ని మండలం శంకోరా గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కామన్ ఫంక్షన్హాల్, రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.10లక్షలతో నిర్మించ తలపెట్టిన సబ్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ. 10లక్షల వ్యయంతో నిర్మించిన జగదాంబ ఆలయ ప్రహరీని ఆయన ప్రారంభించారు.
గ్రామ మాజీ సర్పంచ్ కిషన్లాల్ విగ్రహానికి ఈ సందర్భంగా స్పీకర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించి రైతులకు రెండు పంటలకు కావాల్సిన సాగునీరందిస్తామని వివరించారు. సాగర్ ఆయకట్టేతర రైతులకు జాకోరా, చందూరు లిఫ్ట్ల ద్వారా నీరందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.150కోట్ల నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చించినట్లు తెలిపారు. రైతులకు 24గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 14వేల మందికి రూ.130 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11వేల మందికి డబల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు.112 కామన్ ఫంక్షన్ హాళ్లను నిర్మించినట్లు తెలిపారు. గిరిజనులకు పోడు భూములను ఇప్పటికే పంపిణీ చేశామని, మరికొంత మంది అర్హులకు కూడా భూమి సర్వే చేసి పట్టాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు, జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ పద్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు nడబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు
వర్ని, సెప్టెంబరు 12 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేతావత్ గంగారాం కుటుంబ సభ్యులను మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. బెల్యానాయక్ తండాలోని మృతుడి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య, కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ దవాఖాన వైద్యాధికారులకు సూచించారు. మృతుడి కుటుంబానికి పెంకుటిల్లు ఉండడంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.