నవీపేట, జనవరి 20 : ‘కంటి వెలుగు’కు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు శిబిరాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. మండలంలోని ఆభంగపట్నం, నవీపేటలో కంటి వెలుగు శిబిరాలను పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడారు. ఆరోగ్య సమస్యను గురించి అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోతిబిందు ఆపరేషన్ అవసరం ఉన్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకొని సర్జరీ కోసం నిజామాబాద్ జనరల్ దవాఖానకు రిఫర్ చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కంటి సమస్యలకు సంబంధించిన అన్ని పరీక్షలను ఈ శిబిరాల్లోనే చేసి మందులు, రీడింగ్ గ్లాస్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరం ఉన్న వారికి 15-20 రోజుల్లో వాటిని ఇంటికి పంపించేలా చర్యలు తీసకుంటున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 70 టీములు కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏండ్లుపై బడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు.
అనంతరం మండల కేంద్రంలో, దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మన ఊరు-మన బడి పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణను చదును చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీపీ సంగెం శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, వైద్యాధికారి సామ్రాట్ యాదవ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
కంటి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాడ్వాయి, జనవరి 20 : కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. తాడ్వాయిలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
గ్రామాల్లో ముందుగా నిర్ణయిం చిన ప్రకారం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసర మైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేయాలన్నారు. అధికారులు బాధ్యతగా పని చేస్తూ.. ప్రజలు కంటి వెలుగు కేంద్రాలకు వచ్చేలా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని అన్నారు. గ్రామంలో 125 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్వీర్, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీవో హప్సీబా, వైద్యాధికారులు హజ్మాన్ నజీరా, రాజశేఖర్, ఏపీఎం రవీందర్ తదితరులు పాల్గొ న్నారు.