నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 8 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్ పోలింగ్, పోలింగ్ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని ఈసీఐఎల్కు తరలించారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి పర్యవేక్షించారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచి, సాంకేతిక సమస్యలు తలెత్తిన ఓటింగ్ యంత్రాలను ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వాహనం హైదరాబాద్ వెళ్తున్న క్రమాన్ని సైతం జీపీఆర్ఎస్ ద్వారా పర్యవేక్షించారు. మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్, సంతోష్, జితేందర్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి,డిసెంబర్ 8 : పని చేయని కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాడ్ యంత్రాలను శుక్రవారం ఈసీఐఎల్ హైదరాబాద్కు తరలించినట్లు కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ తెలిపారు. కామారెడ్డిలోని స్ట్రాంగ్ రూంను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్కు తాళం వేసి సీజ్ చేశారు. వీరి వెంట ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.