కంఠేశ్వర్, మే 2: వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
పోలింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా.. 6 గంటల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లభించినట్లు తెలిపారు. ఈ నెల 13న ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.