కంఠేశ్వర్/వినాయక్నగర్, ఏప్రిల్ 17: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. సీపీ కల్మేశ్వర్తో కలిసి కలెక్టరేట్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదివారం మినహాయించి ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు కలెక్టర్ చాంబర్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.
అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. సెక్యూరిటీ కింద జనరల్ అభ్యర్థులు రూ. 25వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని నగదు లేదా చలానా రూపంలో చెల్లించవచ్చని, చెక్కులు అంగీకరించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని, దీని ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాలన్నారు. గరిష్ఠంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు.
మొత్తం 22 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని, ఇప్పటివరకు రూ.33లక్షల 4వేల 837 నగదుతో పాటు రూ. 28లక్షల విలువచేసే ఆభరణాలు, ఇతర వస్తువులు సీజ్ చేశామని వివరించారు. సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ను అనుసరిస్తూ కలెక్టరేట్ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నలుగురికన్నా ఎక్కువ మంది ఒకేచోట ఉండోద్దని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 1900 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ పాల్గొన్నారు.