ఖలీల్వాడి, డిసెంబర్ 4: వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదివారం నిజామాబాద్ నగరం మాలపల్లిలో ఉన్న స్టాన్రిచ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, ఆధార్ లింక్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించి, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి స్థానికుల నుంచి లభిస్తున్న స్పందనపై బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ఆయా అంశాల న మోదు విషయమై బీఎల్వోలకు మార్గనిర్దేశం చే స్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఓటరు జా బితాలో డూప్లికేషన్ పేర్లు లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
ఎవరైనా ఇతర ప్రాంతానికి తరలివెళ్లినట్లయితే ఆ కొత్త ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్లో పేరును నమోదు చేసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే జాబితా నుంచి వారి పేరును తొలగించాలన్నారు. ముందుగా క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి వివరాలను ఆరా తీయాలని, అయినప్పటికీ వివరాలు వెల్లడి కానీ పక్షంలో గరుడ యాప్ సహాయంతో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. మృ తి చెందిన వారి పేర్లను కూడా నిర్ధారణ చేసుకున్న తరువాతే జాబితా నుంచి తొలగించాలన్నారు. 18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయ స్సు కలిగిన ప్రతిఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి గల్లంతు కాకుండా చూడాలని ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరి ఓటు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.