కామారెడ్డి,డిసెంబర్ 20 : ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి బస్టాండ్ను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నదన్నారు. గతంలో రోజూ లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుండేవారని.. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన మహాలక్ష్మి పథకంతో ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని తెలిపారు.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 63 శాతం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు, ఇంట ర్, డిగ్రీ కళాశాలల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతున్నదని అన్నారు. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మహిళల భద్రతకు తగు ఏర్పాట్లు చేయాలని, రద్దీకి అనుగుణంగా అవసరమైతే పోలీసు రక్షణ కల్పిస్తామన్నారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 19 వరకు కామారెడ్డి డిపో నుంచి 6,82,887 మంది ప్రయాణికులు ప్రయాణించగా అందు లో మహిళలే 4,29,812 మంది ఉన్నారన్నారు. మొదటి రోజు 30 శాతం, రెండో రోజు 57 శాతం వినియోగించుకోగా తర్వాత ప్రతి రోజూ 65 నుంచి 68 శాతం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు.