కంఠేశ్వర్, ఏప్రిల్ 17: యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసు పు, మక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ధాన్యం, మక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుంటే రైతులు కంట్రోల్ రూమ్ 08462- 220183 నంబర్లో సంప్రదించి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పని చేస్తుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వరి పంట అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్రస్థాయిలో అందుబాటులోని టోల్ఫ్రీ నంబర్లు 1967కు లేదా 180042 500333కు రైతులు సంప్రదించవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్, ఏఎస్వో అరవింద్రెడ్డి పాల్గొన్నారు.