వేల్పూర్, డిసెంబర్ 6: అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం వేల్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వేముల పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్-3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తుచేశారు. అంబేద్కర్ను అత్యంత గౌరవించే వ్యక్తి కేసీఆర్ అని, వారి ఆశయాలు,ఆలోచనలను దేశంలో సంపూర్ణంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకునేలా కొత్త సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని, హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో, తన పర్యవేక్షణలో ఈ చారిత్రక నిర్మాణాలు చేపట్టడం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఎంపీపీ భీమ జమున, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, స్థానిక సర్పంచ్ తీగల రాధ, మోహన్, ఎంపీటీసీ మొండి మహేశ్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, అంబేద్కర్ సంఘం సభ్యులు సౌడ రవి, టోని, భీమ శ్రీకాంత్, గోపి, కాంతయ్య పాల్గొన్నారు.