బోధన్, నవంబర్ 15: బోధన్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుధవారం బోధన్ పట్టణ శివారులో బోధన్ – నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు జనం పోటెత్తింది. బోధన్ నియోకవర్గ నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన జనంతో ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కొందరు ప్రజలు రోడ్లపైనే ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. సభా వేదిక నుంచి కంటికి కనిపించని దూరంలో వేలాది మంది ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఎదురుచూస్తుండడం కనిపించింది. బహిరంగసభలో సీఎం ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను మరోసారి గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇవ్వగానే సభికుల నుంచి హర్షధ్వానాలు వచ్చాయి. ‘ధరణి’ కావాలా.. వద్దా.., రైతుబంధు కావాలా వద్దా.. అంటూ సభికులకు కేసీఆర్ ప్రశ్నించినప్పుడు జనం ‘కావాలి.. కావాలి..’ అంటూ కేకలు వేశారు. ‘మూడు గంటల కరెంట్ సరిపోతుందా.. అని కేసీఆర్ ప్రశ్నించగా.. సరిపోదు.. సరిపోదు.. అంటూ జనం సమాధానమిచ్చారు. ‘ధరణి కావాలన్నా.. రైతుబంధు కావాలన్నా.. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ కావాలన్నా.. బోధన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇందుకు సభలోని జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజా ఆశీర్వాదసభ గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. కేసీఆర్ సభకు హాజరైన వేలాది మంది జనం స్పందనను చూసిన రాజకీయ పరిశీలకులు ఈ సభతో బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ గెలుపు ఖాయమైందని అంటున్నారు.
శక్కర్నగర్, నవంబర్ 15: బోధన్ పట్టణ శివారులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు ఉదయం 10 గంటల నుంచే సభా ప్రాంగణానికి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలతో నిండిపోగా, పలువురు ప్రాంగణం బయటే నిలుచుని సీఎం కేసీఆర్ ప్రసంగంతోపాటు పలువురి ప్రసంగాలను వీక్షించారు.
ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఆయనకు హెలిప్యాడ్లో బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూదోట రవికిరణ్ ఘన స్వాగతం పలికారు. సీఎం బోధన్కు హెలీకాప్టర్లో మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకుని హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో సభా వేదికపైకి చేరుకున్నారు. ఎమ్మెల్యే షకీల్ ప్రసంగం అనంతరం సీఎం తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించి 29 నిమిషాల పాటు కొనసాగించారు. తెలుగుతో పాటు హిందీలోనూ మాట్లాడారు. సభ అనంతరం బోధన్ నుంచి హెలీక్యాప్టర్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్లో నిర్వహించిన సభకు వెళ్లారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నిర్వహించిన సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.