డిచ్పల్లి, నవంబర్ 15 : డిచ్పల్లిలోని గాంధీనగర్ వద్ద నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాస్థలికి సమీప దూరంలోనే సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేయడంతో డిచ్పల్లి గులాబీమయమైంది. ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో రానున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ ఇదే సభావేదిక నుంచి ప్రసంగం చేశారని, అదే సెంటిమెంట్తో సభను ఇక్కడే ఏర్పాటుచేశామని తెలిపారు.
కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే.. మరింత అభివృద్ధి చేసుకోవచ్చని, రేషన్కార్డుపై సన్నబియ్యం అందజేస్తామని, భూమి లేని వారందరికీ రూ. 5 లక్షల కేసీఆర్ బీమా, మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద రూ.3 వేల పంపిణీ, పెన్షన్ల పెంపు, రూ. 400కే గ్యాస్ సిలిండర్ తదితర వాటిని పొందవచ్చని వివరించారు. నియోజకవర్గంలో డబుల్ రోడ్లు పూర్తయ్యాయని, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట ఇందల్వాయి ఎంపీపీ రమేశ్నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, నాయకులు కృష్ణ, దాసరి లక్ష్మీనర్సయ్య, ఒడ్డెం నర్సయ్య, అమీర్, విండో చైర్మన్ గజవాడ జైపాల్, దండుగుల సాయిలు, నీరడి పద్మారావు, కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగర శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.