బాల్కొండ/ముప్కాల్, సెప్టెంబర్ 5 : ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో అప్రోచ్ బీటీ రోడ్డు రూ. కోటితో సింగిల్ లైన్ నుంచి డబుల్ రోడ్డుగా మార్పు పనుల, వన్నెల్(బీ) గ్రామంలో వన్నెల్(బీ) లింక్ రోడ్డు టు వేంపల్లి, రెంజర్ల న్యూ ఫార్మేషన్ రోడ్డు రూ. కోటి వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో రెంజర్ల నుంచి శెట్పల్లి, వన్నెల్(బీ) వయా డంపింగ్ యార్డు న్యూ ఫార్మేషన్ రోడ్డు రూ.2.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెల్త్ సబ్సెంటర్, మహిళా భవనం, సొసైటీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసేదే చెప్తారు – చెప్పింది చేస్తారని స్పష్టం చేశారు.
అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేస్తారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఆసరా పెన్షన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కుల వృత్తులకు ప్రోత్సాహం సాగునీరు, సకాలంలో ఎరువులు ఇలా ఏ రంగం చూసుకున్నా కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేశారన్నారు. కేసీఆర్ కన్నా గొప్పగా చేస్తామని ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 పెన్షన్ను.. రూ.2 వేలు చేసింది కేసీఆర్ అని.. కాంగ్రెస్ ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 4 వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలన్నారు. స్థానిక ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని, తాను ఈ రోజు పర్యటించిన గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వచ్చిన మార్పుపై గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో బాల్కొండ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, ఎంపీపీ సామ పద్మా వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ బద్దం నర్సవ్వా నర్సారెడ్డి, బోదేపల్లి సర్పంచ్ రవి, వన్నెల్(బీ) సర్పంచ్ నాగుల కిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, రెంజర్ల సర్పంచ్ ఆకుల రాజారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.