నమస్తే తెలంగాణ యంత్రాంగం: రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. సర్వహిత సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ధర్మనిష్ఠ, ఆధ్యాత్మిక చింతన గల నేతగా మన్ననలు అందుకుంటున్నారు. హిందూ ధర్మం, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూనే.. దేశంలోనే ధర్మపరిరక్షకుడిగా నిలుస్తున్నారు. సర్వమతాలను సమదృష్టితో చూస్తున్న కేసీఆర్..తనకు మరెవరూ సాటిరారని నిరూపించుకున్నారు. హిందూ ధర్మం, సంస్కృతిని పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న బ్రాహ్మణుల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ .. బ్రాహ్మణులపై వరాలు జల్లు కురిపించారు. వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.ఐదు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నట్లు నిర్ణయించారు. ఇప్పటి వరకు దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు రూ. 6వేల చొప్పున అందిస్తుండగా..ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.వీటితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయనున్నట్లు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. హిందూ సంస్కృతిని కాపాడుతున్న వారికి సీఎం కేసీఆర్ తగిన గౌరవాన్ని కల్పించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరైన గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు.
కేసీఆర్ గొప్ప ధర్మ పరిరక్షకుడు
కేసీఆర్ గొప్ప హిందూ ధర్మ పరిరక్షకుడు.. బ్రాహ్మణుల గురించి ఆలోచించిన ఏకైక నేత. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత వరకు బ్రాహ్మణుల గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. మా గురించి పట్టించుకొని.. మమ్మల్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయానికి సంతోషిస్తున్నాం. సీఎం మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు రుణపడి ఉంటాం.
బ్రాహ్మణులకు సముచిత స్థానం..అభినందనీయం
కామారెడ్డి,జూన్ 1 : సీఎం కేసీఆర్ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడం అభినందనీయం. పేద బ్రాహ్మణుల కోసం అనేక సం క్షేమ పథకాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. అద్భుతమైన కల్యాణ మండపం, భవన సముదాయాలను నిర్మించి విప్రజాతికి అం కితం చేయడం ప్రశంసనీయం. ఇలాంటి మహత్కార్యం చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
-గంగవరపు ఆంజనేయ శర్మ, వేద పండితుడు, కామారెడ్డి
అందరినీ సమానంగా చూస్తున్నారు..
బీర్కూర్, జూన్ 1: సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజాన్ని ప్రోత్సహిస్తూ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభించడం గర్వకారణం. అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తున్నారు. కేసీఆర్ ధర్మ రక్షకుడు. సమైక్య పాలనలో బ్రాహ్మణులకు ఎలాంటి వేతనాలు, ధూప దీప నైవేద్యాల కింద నిధులు ఇచ్చే వారు కాదు. స్వరాష్ట్రంలో కేసీఆర్ రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం అభినందనీయం. బ్రాహ్మణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ఆదుకుంటామన్న కేసీఆర్కు వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
-కులకర్ణి నందకిశోర్ ప్రధాన అర్చకుడు, తెలంగాణ తిరుమల దేవస్థానం, బీర్కూర్
బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్
లింగంపేట, జూన్ 1: దేశంలో బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్. గత పాలకులు బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అర్చకులను గుర్తించడంతోపాటు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆలయాలకు నిధులు మంజూరు చేసిన మహానేత కేసీఆర్. రాష్ట్రంలో ఆలయాలు, బ్రాహ్మణులకు సరైన గుర్తింపు ఇచ్చారు. కేసీఆర్ కృషితో రాష్ట్ర రాజధానిలో బ్రాహ్మణ సదనం వచ్చింది. అన్ని వర్గాలతోపాటు బ్రాహ్మణ వర్గానికి కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేశారు.
– మెంగవరం రవీంద్రశర్మ, అర్చకులు, లింగంపేట
సీఎం కేసీఆర్ నిర్ణయం అభినందనీయం
విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మాణం బ్రాహ్మణులకు, వారు అందించే ధార్మిక కార్యక్రమాలకు వేదికగా మారుతున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణుల సంక్షేమం గురించి ఆలోచించలేదు. స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రకటించి అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-శ్రీరామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు
కేసీఆర్కు కృతజ్ఞతలు
భిక్కనూరు జూన్ 1: అర్చకులకు ఇస్తున్న గౌరవభృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచడం అభినందనీయం. గౌరవభృతిని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తూ ప్రకటించడం ఎంతో ఊరట కలిగించింది.అనువంశిక అర్చకుల సమస్యలు వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయం.ధూపదీప నైవేద్యం పథకం కింద రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కొడకండ్ల రామగిరిశర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణసేవా సంఘం సమాఖ్య
పెంపు హర్షణీయం
చుక్కాపూర్,జూన్ 1: హిందూ ధర్నాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చుస్తున్న ఘనత సీ ఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుంది. కేసీఆర్ హయాంలో ఆలయాలు పుర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గౌరవ భృతిని రూ.ఐదువేలకు పెంచడం, ధూపదీప నైవేద్యం పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.పది వేలకు పెంచడం హర్షణీయం.
-వేల్పూరి శ్రీనివాసాచార్యులు, అర్చకుడు, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
భీమ్గల్, జూన్1: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బ్రాహ్మణులను పట్టించు కోలేదు. చాలా ఆలయాలు ధూపదీపం కూడా కూ డా నోచుకోలేని పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఆల యాలు పూర్వవైభవం సంతరించు కుంటున్నాయి. లింబాద్రి గుట్ట అభివృద్ధి కూడా ఇందులో భాగంగానే జరిగింది. సుమారు రూ.3.10 కోట్ల నిధులతో ఆలయానికి వచ్చే రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చడంతోపాటు సెంట్రల్ లైటింగ్, గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-నంబి పార్థసారథి, నింబాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, భీమ్గల్
ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి..
సీఎం కేసీఆర్ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. యాదగిరి గుట్టతోపాటు చాలా ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. వేదపండితులకు ఇస్తున్న జీవనభృతిని రూ.5వేలకు పెంచడం చాలా సంతోషంగా ఉంది. వయస్సును కూడా 65 ఏండ్లకు తగ్గించడంతో చాలా కుటుంబాలకు మేలు జరగనున్నది. ధూపదీప నైవేద్యం పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని రూ.పదివేలకు పెంచడం అభినందనీయం.
-జోషి శ్రీనాథ్, నియోజకవర్గ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు, ముచ్కూర్
బ్రాహ్మణ పక్షపాతి కేసీఆర్
శక్కర్నగర్, జూన్ 1: సీఎం కేసీఆర్ బ్రాహ్మణపక్ష పాతి. గతంలో బ్రాహ్మణులపై ఏ నాయకుడు దృష్టి సారించలేదు. స్వరాష్ట్రంలో బ్రాహ్మణులు గర్వంగా జీవించే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. రూ.12కోట్ల వ్యయంతో విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మించడం బ్రాహ్మణుల గౌరవాన్ని పెంచింది. హిందూ, ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న బ్రాహ్మణులకు ఆయన చేస్తున్న మేలు మరువలేనిది.
-బెంబేర్కర్ ప్రవీణ్ మహరాజ్, అర్చకుడు, మారుతీ మందిరం, బోధన్