న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యకం చేస్తూ, సీజేపీ తీరును ‘ద్వంద్వ వైఖరి’గా అభివర్ణించారు. సీజేపీ పార్టీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ పెద్ద పార్టీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నామనేది ఇలాగేనా? అని సీజేపీని నిలదీశారు. ఈ విమర్శలకు సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ సమాధానమిచ్చారు. వర్తమాన యువత ఆలోచనా విధానాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోలేకపోతున్నాయన్నారు. తాము రోడ్లపై కూర్చొని నిరసన తెలుపగలమని, డ్యాన్స్ చేస్తూ పోరాడగలమని సమర్థించుకున్నారు. తమ తరానికి నచ్చినట్లుగా ఉండటం తెలుసని, ఇతరులు నిర్దేశించిన పద్ధ్దతుల్లో జీవించడం రాదని పేర్కొన్నారు.