దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ను పైలట్ మండలంగా ప్రకటించింది. మండలంలోని 1298 మందికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేసింది. ప్రస్తుతం మంచి ఫలితాలతో దళితుల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదం చేస్తున్నది. దళితుల బంగారు భవిష్యత్తుకు బంధువులా చేయూతనందిస్తూ కొండంత ధైర్యాన్నిస్తూ ఆర్థిక భరోసాను ఇస్తున్నది. దళిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ యూనిట్లు స్థాపిస్తూ తమ జీవితాలను చక్కదిద్దుకుంటున్నారు. మెరుగైన జీవనోపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దళితబంధు ద్వారా సత్ఫలితాలను సాధిస్తున్న పలువురు లబ్ధిదారులను ‘నమస్తే తెలంగాణ’ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పలుకరించింది.
– కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/నిజాంసాగర్, ఆగస్టు 27
కామారెడ్డి (నమస్తే తెలంగాణ) /నిజాంసాగర్, ఆగస్టు 27: కామారెడ్డి జిల్లాలోని జుక్కల్(ఎస్సీ) నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మండలంలో నివసించే అన్ని దళిత కుటుంబాల (1,298)కు ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.129.80కోట్లను ప్రభుత్వం అందజేసింది. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లు.. వరికోత యంత్రాలు, పొక్లెయిన్ వాహనాలు, టెంట్ హౌస్, సెంట్రింగ్, పాడి గేదెలు, కోళ్ల పరిశ్రమలు, గొర్రెలు, మేకలు తదితర వాటిని పంపిణీ చేశారు. వీటితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో 300మందికి దళితబంధు పథకం ద్వారా రూ. 30కోట్లను మంజూరు చేసి అందించారు. జిల్లా వ్యాప్తం గా 1,598 మందికి రూ.159.80కోట్లను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1100 యూనిట్ల చొప్పున జిల్లాకు 4400 యూనిట్లు, రూ.440 కోట్లు మంజూరు కాగా, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
మాది నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రా మం. నాకు దళితబంధు పథకం మంజూరైం ది. నాకు చెప్పుల వ్యాపారంలో అనుభవం ఉన్నది. దళితబంధు పథకంలో చెప్పుల దుకా ణం కోసం దరఖాస్తు చేసుకోగా నాకు మం జూరైంది. దీంతో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద చెప్పుల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాను. సీఎం కేసీఆర్ దయతో చక్కగా గిరాకీ అవుతుంది. నాతోపాటు నా కుమారుడు ఇద్దరం కలిసి దుకాణం చూసుకుంటున్నాం. చెప్పుల దుకాణంతోపాటు ట్రాలీ ఆటో తీసుకున్నాను. దుకాణంతోపాటు ప్రతిరోజూ ఒక్కో అంగడికి వెళ్లి అక్కడ చెప్పులు విక్రయిస్తున్నాం. అంగడితోపాటు దుకాణంలో బాగా గిరాకీ అవుతుంది. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.30వేల వరకు సంపాదించుకుంటున్నాను.
– కుంటోల సాయిలు, అచ్చంపేట
గ్రామంలో పనిలేక మొన్నటి వరకు పట్నంలో హమాలీ ప నులు చేసుకుంటూ బతికేవాడిని. దళితబంధు పథకం కింద నాలుగు బర్రెలు తీసుకున్నా. రోజూ ఒక్కో బర్రె ఉదయం నాలుగు లీటర్లు, సాయంత్రం నాలుగు లీటర్లు, మొత్తం 30 లీటర్ల పాలు విక్రయిస్తున్నా. నెలకు రూ.30వేలు సంపాదించుకుంటున్నా. ఆరు నెలల నుంచి సుమారు లక్షా 50వేల వరకు పోగు చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. జీవితంలో ఇలాంటి మార్పు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
– గుడ్ల రవీందర్, మహ్మద్నగర్
దళితబంధు పథకం కింద బొలెరో వాహనం అందజేశారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, పిట్లం, నిజాంసాగర్ పలు గ్రామాల్లో తిరుగుతూ కిరాయికి తిప్పుతున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20వేల వరకు సంపాదిస్తున్నాను. దళితబంధు పథకం వచ్చిన తర్వాత ఇతరుల వద్ద డ్రైవింగ్ పని మానేసి.. సొంత వాహనానికి ఓనర్ అయ్యాను. ఇదంతా సీఎం కేసీఆర్ దయ వల్లే.
– బిట్ల సాయిలు, సుల్తాన్నగర్
నాకు బంజపల్లి గ్రామంలో మూడెకరాల పొలం ఉన్నది. దళితబంధు పథకం మంజూరు కావడంతో ట్రాక్టర్ తీసుకున్నాను. నా పొలం దుక్కి దున్నుకోవడంతోపాటు గడిచిన వానకాలం, ప్రస్తుత యాసంగిలో ఇతరుల పొలాల దుక్కులు దున్నడంతో అన్ని ఖర్చులు పోనూ రూ.3లక్షలు సంపాదించాను. సంవత్సరంలో మూడు లక్షలు మిగలడంతో చాలా సంతోషంగా ఉన్నది. గతంలో ఇతరుల ట్రాక్టర్లను కిరాయికి తెచ్చి వ్యవసాయం చేసుకునేవాడిని. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అందించడంతోనే మాలాంటి దళితులకు మంచిరోజులు వచ్చాయి.
– బేగరి సాయిలు, బంజపల్లి
నేను అగ్రికల్చర్ డిప్ల్లొమా చదివి మొన్నటి వరకు ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.20వేల జీతం ఇచ్చేవారు. దళితబంధు పథకం మంజూరు కావడంతో మా గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పటి వరకు రెండు సీజన్లు గిరాకీ చేసుకున్నాను. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నాను. రెండు సీజన్లు కలిపి సుమారు మూడు లక్షల వరకు సంపాదించుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా బతుకుతున్నాను.
– అశోక్, మాగి
దళితబంధు పథకం దళితులకు వరం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిజాంసాగర్ మండలంలోని 1298 దళిత కుటుంబాలు బాగుపడ్డాయి. వందలాది మంది ఉపాధి పొందారు. ఆర్థిక పరిపుష్టిని సాధించారు. అనేక రంగాల్లో స్థిరపడ్డారు. సొంతంగా వ్యాపారాలు చేసుకొంటూ దర్జాగా జీవిస్తున్నారు. జిల్లాలోని మిగితా నియోజకవర్గాల్లోనూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది.
– దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కామారెడ్డి
గోర్గల్ గ్రామానికి చెందిన మంగ ప్రకాశ్కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెండ్లి చేసినా తన పిల్లలతో కలిసి తండ్రి ఉంటున్న గోర్గల్లోనే ఉంటున్నారు. దళితబంధు పథకంలో ప్రకాశ్తోపాటు కుమారుడు పాల్దినాకర్, కుమార్తె నాగమణిలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున మంజూరయ్యాయి. ముగ్గురు కలిసి ఒకే యూనిట్ను ఎంపిక చేసుకున్నారు. వరికోత యంత్రంతోపాటు ఓ ట్రాలీని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు మూడు సీజన్లలో వరి కోతలు చేయగా అన్ని ఖర్చులు పోనూ సుమారు ఆరు లక్షల వరకు సంపాదించారు. ఇదంతా కేసీఆర్ పుణ్యమే అంటూ ఆయనను దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి పంట నూర్పిళ్లు చేస్తామని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధుతో కూలీల నుంచి ఓనర్లుగా మారామని సంబురపడుతున్నారు.
– నాగమణి, ప్రకాశ్, దినాకర్ పాల్, గోర్గల్