బాన్సువాడ, మే 27 : అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశంలో అన్నదాతకు భరోసా ఇస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో బాన్సువాడ నియోజకవర్గ రైతులతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో వచ్చే అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు బాన్సువాడలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే మొదటిసారి అని తెలిపారు. నవంబర్లో వచ్చే తుపాన్, ఏప్రిల్లో కురిసే వడగండ్లు రైతులకు జీవన్మరణ సమస్యలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతివైపరీత్యాలను తప్పించలేమని అన్నారు. కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకునే శక్తి మాత్రం మనకు భగవంతుడు ఇచ్చాడన్నారు. తద్వారా పంటలను కాపాడుకోవచ్చన్నారు. రోహిణి కార్తె మే మాసం చివరి లేదా జూన్ మొదటి వారంలో నార్లు పోసిన నెలలోపే నాట్లు వేసుకోవాలని సూచించారు. పంట కాలం 125 రోజుల నుంచి 130 రోజులు ఉంటుందని తెలిపారు. దీంతో అక్టోబర్, నవంబర్లో వచ్చే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని సభాపతి సూచించారు.
రైతులు కోరితే నార్లు పోసుకోవడానికి నిజాంసాగర్ కాలువల కింద నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. సాగునీటికి ఢోకా లేదన్నారు. నిజాంసాగర్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తెచ్చుకోవచ్చని తెలిపారు. విత్తనాలు , ఎరువులకు కొరత లేదన్నారు. వచ్చే 50 ఏండ్ల వరకు బాన్సువాడ నియోజక వర్గంలో లోవోల్జేజీ విద్యుత్ సమస్య ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా దామరంచ వద్ద రూ .70 కోట్లలో 220 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బాన్సువాడ నియోజకవర్గంలోని రైతులు వరి పంట సాగు, దిగుబడిలో రాష్ట్రంలోనే ముందువరుసలో ఉన్నారని తెలిపారు. కొంతమంది రైతులు ఆలస్యంగా నార్లు పోసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారని అన్నారు.
రైతులు అప్పులపాలు కాకూడదని, లాభాలు ఆర్జించి దర్జాగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఆలస్యంగా నాట్లు వేసేవారు ఇకనైనా మారాలని, ఆలోచన చేసి పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని సూచించారు.ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నా.. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో పంటల ఉత్పత్తులను కొనేదిక్కులేదని అన్నారు. ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని వివరించారు. ఇది రైతాంగం గర్వంగా చెప్పుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు.ఇటీవల మక్క, జొన్నలు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ను వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి అడుగగా.. వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఏ పంటలు పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆరే అని అన్నారు.
రాష్ట్రంలో 2014 లో కోటీ 8 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే.. నేడు రెండు కోట్ల 18 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ సరాఫరా, ఎరువులు , విత్తనాలు అందుబాటులో ఉంచడం, మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని అన్నారు. 2014లో రాష్ట్రంలో మొత్తం వరిధాన్యం ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. 2021-22 లో కోటీ 30 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపారు. వ్యవసాయాధికారులు రైతు వేదికలను ఉపయోగించుకొని రైతులకు సేవలను అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను కలిసి నివేదికలను రూపొందించాలని, గాలి లెక్కలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామానికి మంజూరు చేసిన ప్రభుత్వ పథకాలు, నిధులను తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రామ్ రెడ్డి, పాల్య విఠల్, రఘు, జడ్పీటీసీలు హరిదాస్, శంకర్ పటేల్, తహసీల్దార్లు గంగాధర్, రాజు, బాన్సువాడ ఏడీవో వినయ్కుమార్ రెడ్డి, ట్రాన్స్కో డీఈ కామేశ్వర్రావు, ఇరిగేషన్ డీఈ శ్రావణ్కుమార్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, భూమన్న , ఏఎంసీ చైర్మన్లు , రైతుబంధు సమితి మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మొదటగా వరి ధాన్యం కాంటాలు ఏర్పాటుచేసేది బాన్సువాడ నియోజకవర్గంలోనే అని తెలిపారు. నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల్లో వానకాలంలో పండే సన్నరకం బియ్యానికి ఇతర రాష్ర్టాలతోపాటు విదేశాల్లో బాగా డిమాండ్ ఉన్నదని చెప్పారు. అందుకే ఇతరప్రాంతాల నుంచి రైస్ మిల్లర్లతోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, గుంటూరు, రెంటచింతల, తమిళనాడు, కేరళ రాష్ర్టాల నుంచి ప్రత్యేకంగా బాన్సువాడ నియోజక వర్గంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని వివరించారు.యాసంగి కోసం నవంబర్ రెండో వారంలో నార్లు పోసుకోవడం ద్వారా ఏప్రిల్ మాసంలో కురిసే అకాల వర్షాలు, వడగండ్ల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ముందస్తు నాటుతో చీడపీడలుతగ్గుతాయన్నారు.