వినాయక నగర్, జూన్, 03 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 300 క్వార్టర్స్ ఏరియా గోశాల ముందు గల సావిత్రి అనే మహిళ మెడల్ నుంచి దుండగులు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే..సావిత్రి అనే మహిళ తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకొని పరారయ్యారు.
బాధితురాలు గట్టిగా అరిచినప్పటికి దుండగులు ఎవరికి చిక్కకుండా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. చైన్ స్నాచింగ్ ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.