భీమ్గల్, జూలై 19: పట్టణంలో ఆర్టీసీ బస్డిపోపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బస్ డిపో పునః ప్రారంభించడానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో ఇదివరకే మంత్రి మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి బస్డిపోను పునః ప్రారంభించేందుకు మంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాంభించడానికి సిద్ధంగా ఉన్న బస్ డిపో ఎదుట బీజేపీ నాయకులు ధర్నాల పేరుతో కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నారని దుయ్యబట్టారు. పసుపు బోర్డు తెస్తామని చెప్పి రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి మాట తప్పిన ఎంపీ అర్వింద్, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తున్న మంత్రిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, భీమ్గల్ సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, నర్సయ్య, లింగయ్య, గంగాధర్, లింబాద్రి, సతీశ్, నాయకులు ఎంపీటీసీ రాజేశ్వర్, అజ్మత్, రజాక్, నాయకులు కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.