పేద కుటుంబాలకు పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ కొండంత ‘ఆసరా’గా నిలిచారు. ప్రతి నెలా ఠంచన్గా పింఛన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి.. లబ్ధిదారులకు మరో హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి రాగానే రూ.3 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ సర్కారు తొలిసారి అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేసింది. ఐదేండ్లలో ఏకంగా ఐదింతలు పెంచింది. కాంగ్రెస్ పాలనలో రూ.200 ఉన్న పింఛన్ను వెయ్యి చేసి అభాగ్యులకు అండగా నిలిచింది. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. ఎన్నికల వేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎవరూ అడగకుండానే పింఛన్ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. ఇక, మూడోసారి అధికారం చేపట్టగానే రూ.3వేలు చేస్తామని, దశల వారీగా పెంచుతూ రూ.5 వేలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తాజా మ్యానిఫెస్టోలో చేర్చిన ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పెద్ద కొడుకు లెక్క ఆదుకుంటున్న కేసీఆర్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రమే రూ.2016 ఆసరా పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ తెలంగాణలో రూ.4వేల ఆసరా పింఛన్ ఇస్తామని హామీ ఇస్తున్న విపక్ష పార్టీలు.. వారు ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కేసీఆర్ ఇస్తున్న రూ.2016 పింఛన్లో సగం కూడా ఇవ్వడం లేదు. ఆ విపక్షాల్లో ఓ విపక్షం గతంలో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది గుప్పెడంత మందికి గురిజంత మాత్రమే. అప్పుడు ఇక్కడ ఇవ్వని పార్టీ..ఇప్పుడు వారు అధికారంలో ఉన్నచోట కూడా అరకొర పింఛన్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రూ.4వేలు ఇస్తామంటే ఎవరు నమ్మాలి..ఎలా నమ్మాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో రూ.200 మాత్రమే ఉన్న పింఛన్ను ఏకంగా రూ.1016కు పెంచి, అటు తర్వాత రూ.2016కు పెంచి అందిస్తూ వచ్చిన కేసీఆర్. ఇప్పుడు ఏడాదిలో రూ.3016కు పెంచి అటు తర్వాత ఐదేండ్లలో రూ.5016 వరకు ఆసరా పింఛన్ను పెంచుతామని మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీనే నమ్ముతామనే మాటలు లబ్ధిదారుల్లో వినిపిస్తున్నాయి. విపక్షాల పాలన సమయంలో వందల మందికి మాత్రమే వచ్చే పింఛన్ కేసీఆర్ వచ్చాక వేల మందికి వస్తున్న విషయాన్ని లబ్ధిదారులు గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి పాలకుల హయాంలో మొదట రూ.70 పింఛన్ సమయంలో చిటికెడు మందికి, రూ.200 పింఛన్ సమయంలో పిడికెడు మందికి వచ్చే పరిస్థితి ఉండేది. పింఛన్ కోసం ఎదురు చూసే వారు గ్రామంలో ఎవరైనా వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు చనిపోతే ఆ స్థానంలో తమకు పింఛన్ వస్తుందని ఎదురుచూసే దౌర్భాగ్యం ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వేల మందికి పింఛన్ వస్తున్నదనే చర్చ జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి పాలకుల హయాంలో రూ.70 చొప్పున, రూ.200 చొప్పున కొద్దిమందికి మా త్రమే పింఛన్ వస్తే నేడు 2లక్షల79 వేల మందికి పింఛన్ వస్తుండడం లబ్ధిదారు ల్లో కేసీఆర్ మ్యానిఫెస్టో హామీపై విశ్వాసం పెంచుతున్నది.
కేసీఆర్ సారు కష్టకాలంల ఆదుకునే మనిషి. ఎవరికి ఎప్పుడు ముందుగల్ల ఏది గావాలా..ఎంత గావాలా అని ఆలోచించి కష్టం దూరమయ్యే సహాయం అందిస్తడు. గందుకే ముందుగల్ల ముసలోల్ల పింఛన్ 2వందల కెళ్లి వెయ్యికి..వెయ్యికెళ్లి 2 వేలకు పెంచిండు. కేసీఆర్ సార్ పింఛన్ పైసలను ఓట్ల కోసం పెంచలేదు. నాలుగు పైసలు పెంచి ఇస్తే ముసలోల్లకు, ముడిగోల్లకు ఆసరా అవుదని వెంచిండు. గది మా మనసుకు ఎరుక.
ఇప్పుడు మల్ల గా పాతోల్లే వచ్చి 4వేలు ఇత్తమంటున్నరు. మునుపట్ల గాల్లున్నప్పుడు 2వందలే ఇచ్చిండ్రు. మల్లచ్చి 4వేలు అనంగనే నమ్ముతమా. గాల్లు ఇచ్చే 2వందలను 2 వేలు జేసిండు కేసీఆర్ సారు. గాయననే మల్ల 3వేలు జేసి మెల్లగా 5 వేలు ఇస్తమంటున్నడు. గాయనతోనే ఇచ్చుడవుతది.
గప్పట్ల రూ.200 పింఛన్ అచ్చేటప్పుడు ఊళ్లే ఓళ్లు కాలం జేత్తరా..గాళ్ల జాగాల పింఛన్ అత్తది అని ముసలోళ్ల్లు ఎదురు సూసే పడువడ్డ రోజులుంటుండే. నూట్లె పది మందికి అత్తుండె.. తొంభై మందికి రాకపోతుండే. కేసీఆర్ సార్ అచ్చినంక నూట్లె తొంభై మందికి అత్తున్నయ్. పది మందికి రాకపోతె మెల్లగా అల్లకు సుక ఇత్తా వోతున్నరు. గిసుంటి మంచోళ్లను గాదని ఓట్లు రాంగనే ఆగమాగం అవుతమా.
ఇప్పుడు ఇస్తున్న రూ.2016 పింఛను ఈ యాడాది లోపల్నే రూ.3వేలకు పెంచడమే కాకుండా ఐదేండ్ల లోపు రూ.5 వేలకు పెరుగుతది. అన్నివర్గాల సంక్షేమాన్ని ముందుకు తీసుకపోయే క్రమంలో ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఇచ్చిన ఈ హామీ ఆమోదయోగ్యంగా ఉన్నది. ఆచరణ సాధ్యంగా కూడా ఉన్నది.
కేసీఆర్ వెయ్యి రూపాల పింఛన్ ఇస్తన్నడు ఇచ్చిండు. మల్ల వచ్చి వెయ్యి రూపాలు పెంచుత అన్నడు పెంచిండు. ఇప్పుడు మళ్ల వెయ్యి పెంచి ఇస్తంటున్నడు ఇస్తడు సుక. గిట్ల పింఛన్ మీద మాకు ఇప్పటి దాక ఇచ్చినోళ్ల మీదనే నమ్మకమున్నది.