BRS Leaders | కోటగిరి, ఆగస్టు 30 : అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇల్లు నేలకూలి అద్దె ఇంట్లో ఉంటున్న పల్లికొండ సాయిలు, అనితకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఇల్లు నేలకూలిన విషయాన్ని సమాచారం ఇచ్చి లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారు. అనంతరం గాండ్ల సాయిలు అనే వ్యక్తి ఇల్లు బ్రాహ్మణగల్లి లో కూలిపోవడంతో ఆ ఇంటిని పరిశీలించారు. ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో రేకులు వేసుకునేందుకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డ వారి పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రజల పక్షాన నిలబడడం బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. వర్షానికి నేలకూలిన ఇండ్ల సర్వే చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అధికారులు నేలకూలిన ఇండ్లను పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, కోటగిరి సహకార సంఘం ఉపాధ్యక్షులు బొట్టే గజేందర్, సమీర్, శంకర్ గౌడ్ బాబు పటేల్, కప్ప సంతోష్, నజీర్, మహేష్ రెడ్డి, తెల్ల చిన్న అరవింద్, మోరే గౌతం, మామిడి నవీన్, యోగేష్, రుద్రంగి సందీప్, బోయి సంఘం అధ్యక్షుడు సాయిలు, పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.