తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా సరిగ్గా 22 ఏండ్ల క్రితం ఏర్పాటైన భారత రాష్ట్ర సమితికి ఇందూరు గడ్డ ఊపిరులూదింది. ఉద్యమ రథ సారథి కేసీఆర్ నాయకత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఖ్యాతి ఉమ్మడి జిల్లాకే దక్కింది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) రెండు దశాబ్దాల కాలంలో అనేక మైలురాళ్లు అధిగమించింది. ఉభయ జిల్లాల ప్రజలు మొదటి నుంచి గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు. ఏ ఎన్నిక జరిగినా ఏకపక్షంగా విజయాలు కట్టబెట్టారు. ఉద్యమ సమయంలోనూ, స్వరాష్ట్ర పాలనలోనూ కేసీఆర్ వెన్నంటి నడిచారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంస్థాగతంగా ఎంతో బలోపేతమైంది.
నిజామాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రులుంటారు. కానీ మాకు మాత్రం రాష్ట్రం తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ… ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వాస్తవానికి 28 రాష్ర్టాలతో కూడిన యావత్ భారతదేశంలో రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా విజయవంతంగా పరిపాలన అందిస్తోన్న ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కరే. రెండు పర్యాయాల పాటు భారీ మెజార్టీ ప్రజల మద్దతును చూరగొన్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు 22 ఏండ్ల ప్రస్థానాన్ని ముగించుకొని పరుగులు తీస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో జిల్లాల్లో జోరుగా వినూత్న కార్యక్రమాలు జరిగాయి. మినీ ప్లీనరీలు దద్దరిల్లడంతో ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్న సంకేతాన్ని అధిష్టానం అందించింది. ఆవిర్భావ వేడుక సందర్భంగా నేడు హైదరాబాద్ – తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులంతా హాజరవుతున్నారు.
సంస్థాగత నిర్మాణంలో భేష్…
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా 22 ఏండ్లు పూర్తి చేసుకున్నది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమైన భారత రాష్ట్ర సమితి పార్టీ దేశంలోనే ప్రత్యేకతను సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సభలు, సమావేశాలు కోకొల్లలుగా జరిగాయి. ప్రతి జిల్లాలో, నియోజకవర్గ కేంద్రాల్లో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేశారు. చారిత్రాత్మకమైన సభలతో ప్రపంచ రికార్డులను సైతం తిరగరాసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే సొంతం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల సమయాల్లోనూ సభలతో ప్రజలకు దగ్గరైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 5లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ ఉభయ జిల్లాల్లో మిగిలిన పార్టీల కన్నా ప్రథమ స్థానంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ కన్నా రెట్టింపు స్థాయిలో కార్యకర్తల బలంతో గులాబీ పార్టీ బలోపేతమైంది. క్రియాశీలక సభ్యులకు వివిధ పార్టీ పదవులతో సముచిత స్థానాన్ని కట్టబెట్టారు. పార్టీకి ఏండ్లుగా సేవలందిస్తున్న వారికి వివిధ స్థాయిల్లో పదవులను అందించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సారథ్యంలోనే పార్టీ కమిటీల కూర్పు జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టడం మూలంగా గులాబీ పార్టీ బలం క్షేత్ర స్థాయిలో ధృఢంగా మారింది.
జై తెలంగాణ… జై భారత్…
గతేడాది అక్టోబర్లో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సరికొత్త నినాదంతో దేశ వ్యాప్తం అవుతున్నది. అందులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు కలిగిన మహారాష్ట్రలోని ముఖ్యమైన ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రస్థానం షురూ చేసింది. ఫిబ్రవరి 5న నాందేడ్ సభతో ప్రభంజనం సృష్టించి, అనంతరం కందార్ – లోహ సభతో ప్రజల్లో చర్చకు దారి చూపింది. తాజాగా ఔరంగాబాద్లో జరిగిన భారీ సభతో కేసీఆర్ పొరుగు రాష్ట్రంలోనూ గులాబీ జెండా గొప్పతనాన్ని చాటి చెప్పారు. జై భారత్ నినాదంతో మరాఠా ప్రజల హృదయాల్లో నిలిచి పోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్ రావాల్సిందేనన్న సంకేతాలను ఇస్తుండడంతో పొరుగు ప్రాంతాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. నాలుగైదు ఏండ్లుగా నిజామాబాద్, కామారెడ్డి సరిహద్దులో నివసిస్తున్న మరాఠా ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటూ తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ నినదిస్తున్నారు. వారి ఆలోచనలు, ఆకాంక్షలకు తగ్గట్లుగా మహారాష్ట్రలో రాజకీయ ప్రస్థానాన్ని కేసీఆర్ మొదలు పెట్టారు. బీజేపీకి దేశ రాజకీయాల్లో సమాధి కట్టేందుకు నడుం బిగించారు.
కంచుకోట ఇందూర్…
తెలంగాణ తెచ్చిన పార్టీగా దేశంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా రికార్డుకెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది వసంతాలను దాటుకుని విజయవంతంగా పరుగులు తీస్తున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా అలుపెరగని పోరాటం చేసిన గులాబీ పార్టీ… అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా నిలబెట్టారు. 2014లో, 2018లో రెండుమార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడే… సీఎంగా ఉండడంతో స్వరాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నది. ప్రజల అభీష్టం మేరకు పథకాలు అమలవుతున్నాయి. మరోవైపు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ గడిచిన కొద్ది కాలంలో రికార్డు స్థాయి సభ్యత్వాలతో జాతీయ పార్టీలకు దీటుగా నిలిచింది. అధిష్టానం ఆదేశాలతో గ్రామ, వార్డు, మండల, అనుబంధ కమిటీల నియామకం విజయవంతంగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకొని తరగని కార్యకర్తల బలాన్ని సంపాదించుకున్నది.
దేశానికి బీఆర్ఎస్ దిక్సూచి…
తెలంగాణలో టీఆర్ఎస్ సాధించిన ప్రగతి ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో దేశ వ్యాపితం కానుంది. ఇప్పటికే దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. పక్కన మహారాష్ట్ర మొత్తం కేసీఆర్ కోసం కదిలి వస్తోంది. ఫేక్ గుజరాత్ మోడల్ తమకొద్దంటూ ప్రజలు కుండబద్ధలు కొడుతున్నారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి శ్రీరామరక్ష అంటూ నినదిస్తున్నారు. రైతుకు కొండంత అండగా బీఆర్ఎస్ నిలుస్తుందన్న నమ్మకం దేశ రైతన్నల్లోనూ ఏర్పడింది. సకల జనులకు బంధువు బీఆర్ఎస్ పార్టీ.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
ప్రజల గుండె చప్పుడు బీఆర్ఎస్…
కేసీఆర్ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు. పాలకుడిగా తెలంగాణను అగ్రగామిగా నిలిపిన అభివృద్ధి ప్రదాత. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. కనీవినీ ఎరుగని అభివృద్ధి పథకాలతో నేడు దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శమై నిలిచింది. గులాబీ జెండా ప్రజల గుండె చప్పుడు. బీఆర్ఎస్ పార్టీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది. రాదనుకున్న తెలంగాణను ప్రాణాలు తెగించి కేసీఆర్ తీసుకు వచ్చారు. భారతదేశానికి కొత్త నాయకత్వం కేసీఆర్ రూపంలో రావడం ఖాయం.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ జాతిపిత కేసీఆర్…
కేసీఆర్ ఉద్యమ నేతగా చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడు. పోరాటాల ద్వారా తెచ్చుకున్న రాష్ర్టానికి పాలకుడిగా తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్. దేశ రాజకీయాల్లో బీజేపీని ఢీకొట్టే సత్తా కేవలం బీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్కు మాత్రమే ఉంది. వేరెవ్వరికీ అంతటి పోరాట పటిమ లేదు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఇక రాబోవు రోజుల్లో దేశానికి దారి చూపుతుంది.
– ముజీబుద్దీన్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు