న్యూఢిల్లీ, ఆగస్టు 6: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునే అభివృద్ధి ప్రాజెక్టులు మేడిపండు లాంటివని మరోసారి రుజువైంది. లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ జాతీయ రహదారులను అమెరికాతో పోలుస్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన కేవలం 18 రోజులకే ఆ ప్రాజెక్టు నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. 63 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్వేలో 84 చోట్ల భూమి కుంగిపోయినట్లు సమాచారం. ఇది నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నది. నష్టం జరిగిన తర్వాత ప్రాజెక్టు కాంట్రాక్టర్ అయిన సీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ను పనితీరు సరిగా లేని సంస్థగా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులను తొలగించి రానున్న రెండేండ్లపాటు ఎలాంటి పనులు చేయకుండా నిషేధించింది. ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన నిపుణుల బృందం ఇప్పుడు ఆ నష్టానికి గల కారణాలను పరిశీలిస్తుంది.
ఎక్స్ప్రెస్వేపై కాన్పూర్ వైపు వెళ్లే మార్గంలో 39 చోట్ల ప్యాచ్వర్క్(తాత్కాలిక మరమ్మతులు) చేశారు. అంటే, రోడ్డు కుంగిపోయిన తర్వాత అక్కడ మరమ్మతులు చేపట్టారన్నమాట. లక్నో వైపు వెళ్లే మార్గంలో 45 చోట్ల మరమ్మతులు చేశారు. అంటే మొత్తం ఎక్స్ప్రెస్వేపై కలిపి మొత్తం 84 చోట్ల మరమ్మతులు చేయాల్సి వచ్చింది. లక్నో నుండి ఉన్నావ్కు వెళ్లే మార్గాన్ని ఇజ్రాయెల్ ఖేడా వద్ద మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. ఇక్కడ 200 మీటర్ల పరిధిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇక్కడ మళ్లీ ఒక గుంత ఏర్పడింది. కాన్పూర్ నుంచి లక్నో వెళ్లే మార్గంలో కొంత భాగానికి మరమ్మతులు జరుగుతున్నాయి. జూలై 30న కంకర లోడ్తో వెళుతున్న ఒక ట్రక్కు కుంగిపోయిందని అక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. చక్రం బయటకు తీసినపుడు ట్రక్కు మొత్తం బోల్తాపడిందని వారు చెప్పారు. ఎక్స్ప్రెస్వే కుంగిపోవడంపై లక్నో సీనియర్ ఇంజినీర్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ మట్టిని పరిచేటప్పుడు, పునాదిని నిర్మించేటప్పుడు అక్రమాలు జరిగినట్టు కనిపిస్తున్నది అని అన్నారు.
ఈ ఎక్స్ప్రెస్వేను పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ యజమాని ప్రదీప్ జైన్. ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నవీన్ జైన్ సోదరుడు. ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణ కాంట్రాక్టు 2022 ఫిబ్రవరి 23న కేటాయించారు. 2024 అక్టోబర్లో కొత్త టెండర్లలో పాల్గొనకుండా ఆ కంపెనీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాకుండా దాని అనుబంధ సంస్థలైన పీఎన్సీ ఖజురహో హైవేస్, పీఎన్సీ బుందేల్ఖండ్ హైవేస్పై కూడా నిషేధం విధించారు. సీబీఐ నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఈ చర్య తీసుకున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులకు లంచం ఇవ్వడానికి, వారికి అక్రమ ప్రయోజనాలు కల్పించడానికి ప్రయత్నించినట్టు ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం ఏడాది తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. 63 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి రూ. 4,700 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక కిలోమీటర్కు రూ. 75 కోట్ల చొప్పున ఖర్చు చేశారు. దేశంలో ఉన్న అన్ని ఎక్స్ప్రెస్వేలతో పోలిస్తే ఇదే అత్యంత ఖరీదైనది.
భారీ వర్షాల కారణంగా కాన్పూర్-లక్నో ఎక్స్ప్రెస్వేలోని ఒక భాగంలో రోడ్డు కుంగిపోవడంతో నీటితో నిండిన రోడ్డును ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్లను ఏర్పాటుచేశారు. మరమ్మతు పనులు కొనసాగుతుండగా ట్రాఫిక్ను సింగిల్ క్యారేజ్వే ద్వారా మళ్లిస్తున్నారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందు దెబ్బతిన్న ప్రాంతంలోని నేల నుండి తేమను తొలగించేందుకు అక్కడ శక్తివంతమైన ఫ్యాన్లను ఏర్పాటు చేసినట్టు అక్కడి దృశ్యాలు చూపిస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న అమెరికా నమూనా ఇదేనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.