న్యూఢిల్లీ: 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈపీఎస్-95 పథకం కింద మెరుగైన ప్రయోజనాల కోసం దశాబ్ద కాలంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వృద్ధ పింఛనుదారులు బుధవారం జంతర్ మంతర్ వద్ద వర్షాన్ని, ఎండను సైతం లెక్కచేయకుండా నిరసన తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో దాదాపు 81 లక్షల మంది ఈపీఎస్-95 పింఛనుదారులు ఉన్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్-95 నేషనల్ ఆజిటేషన్ కమిటీ(ఎన్ఏసీ) ప్రభుత్వం కనీస నెలవారీ పింఛన్ను రూ. 1,000 నుండి రూ. 7,500కు పెంచి, కరువు భత్యం(డీఏ), వైద్య ప్రయోజనాలను కల్పించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని హెచ్చరించింది.
అలా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని, ఆ తర్వాత జైల్ భరో ఉద్యమాన్ని చేపడుతామని ఎన్ఏసీ హెచ్చరించింది. ఈ ప్రతిష్టంభన కొనసాగితే నిరవధిక నిరాహార దీక్షతోపాటు పార్లమెంట్ ముందు ఆత్మాహుతికి కూడా పాల్పడతామని కొందరు నాయకులు హెచ్చరించారు.
పెన్షన్ను ద్రవ్యోల్బణంతో అనుసంధానించాలని, రూ.3 వేల కనీస పెన్షన్కు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ వాటాను 1.16 శాతం నుండి 8.33 శాతానికి పెంచాలని 2015లో బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. ఇందుకోసం భగత్ సిగ్ కోష్యారీ కమిటీ నివేదికను ఆయన ప్రస్తావించారు. దశాబ్దం తర్వాత ఆ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఏమి చేసిందని అడిగినప్పుడు కోష్యారీ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాల మేరకు వాటిని అమలు చేసినట్టు కార్మిక శాఖ 2023 మార్చి 23న రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ప్రధాన డిమాండ్ విషయానికి వస్తే ప్రభుత్వం ఆర్థికపరమైన పరిమితులను ప్రస్తావించింది. బడ్జెట్ మద్దతు ద్వారా 2014 సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన రూ.1,000 కనీస పెన్షన్ను గుర్తు చేసింది.