ఖలీల్వాడి, ఏప్రిల్ 2: సిట్టింగ్ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఇద్దరూ దొందూ.. దొందేనని, నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేసింది శూన్యమేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్రెడ్డి ఒక్కనాడైనా మోపాల్ ప్రజల వద్దకు వచ్చి మంచిచెడు అడిగారా? రూరల్ నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామానికైనా ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎంపీగా అర్వింద్ గెలిచి ఐదేండ్లు అవుతుందని, ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. జిల్లా ప్రజలకు తండ్రీకొడుకులు ఏం చేశారో చెప్పాలని, ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయని వారు ఇప్పుడెలా చేస్తారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.
ఆశీర్వదించి తనను ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని, పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీలో, మిగతా రోజుల్లో జిల్లా ప్రజల వద్దే ఉంటానని తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత బోధన్ నుంచి బీదర్కు డబుల్ రైల్వేలైన్ వేయడంతోపాటు జక్రాన్పల్లిలో ఎయిపోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తానని వివరించారు. కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టారన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించుకుంటామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అనేక అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, జడ్పీటీసీ కమలానరేశ్, మం డల అధ్యక్షుడు శ్రీనివాస్, ముత్తెన్న, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.