ఖలీల్వాడి, ఏప్రిల్ 17: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుకే దిక్కులేదు కానీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలలు అయినా ఇప్పటి వరకు చేయకపోగా ఆగస్టులో చేస్తామని, ఎన్నికల కోడ్ అడ్డం ఉన్నదని చెబుతున్నారన్నారు.
ఆరు గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు తప్ప వారు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం లేదు కానీ, రుణమాఫీ పేరిట మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్రెడ్డి ఎప్పుడైనా వచ్చి నిరుద్యోగ సమస్యలను తెలుసుకున్నారా..? పరిష్కరించారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతుల బతుకులను ఆగం చేస్తారన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఐదేండ్లలో చేసిందేమీలేదని అన్నారు. మాటలు తప్ప పనిచేసిన పాపాన పోలేదని విమర్శించారు. అర్వింద్ను ప్రజలు నమ్మడం లేదనే మోదీని చూసి ఓటు వేయాలని అడుగుతున్నాడని అన్నారు. మోదీకి ఓటు వేస్తే సమస్య కూడా మోదీ వచ్చి తీరుస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పచ్చగా ఉన్న తెలంగాణ నాలుగు నెలలకే ఆగమవుతున్నదని అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు బాజిరెడ్డి తెలిపారు. అదేరోజు కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్రావు హాజరవుతారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రశ్నించే పార్టీ అని, తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ జగన్ మోహన్, సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు సుజిత్సింగ్ ఠాకూర్, నగర అధ్యక్షుడు సిర్పరాజు, కార్యదర్శి ఎనుగందుల మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు.