‘బీజేపీ ఎంపీ అర్వింద్.. నువ్ ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టేది లేదు. ఎక్కడ పోటీ చేసినా నిన్ను ఓడించడం తథ్యం. ఎంపీగా పోటీ చేయకుండా కోరుట్ల పారిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంటున్నావట. ఎమ్మెల్యేగా కాదు కదా సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేసినా సరే వెంటాడి ఓడిస్తా. పసుపుబోర్డు పేరు చెప్పి అటు ప్రజలను మోసం చేసిండు. టికెట్ల పేరుతో ఇటు పార్టీ నేతలను మోసం చేసిండు. సొంత పార్టీ కార్యకర్తలే అర్వింద్ను ఓడిస్తారు.’
– హైదరాబాద్లో గురువారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు భయం మొదలైంది. ఇటు సొంతపార్టీలో వెల్లువెత్తుతున్న అసమ్మతి.. అటు ప్రజల్లో పెరిగిన అసంతృప్తి.. వెరసి అ‘ధర్మపురి’లో ఆందోళన తీవ్రమవుతున్నది. అందుకే రాజకీయ క్షేత్రాన్ని మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కానీ, ఎక్కడకు వెళ్లినా వెంటాడి ఓడిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన శపథం ఎంపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ‘బిడ్డా అర్వింద్ నువ్ ఎక్కడికి వెళ్లినా వదిలేది లేదు. వెంటాడి ఓడిస్తానని’ కవిత గురువారం మరోమారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కవితను, బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కోలేక అర్వింద్ తప్పుడు కూతలు కూస్తున్నాడు. అభివృద్ధి పనులపై వితండవాదానికి దిగుతున్నాడు. అర్వింద్ వాడుతున్న భాషను, వేస్తున్న వేషాలను చూసి ప్రజలే కాదు సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. బాండ్పేపర్తో లక్కీగా గెలిచిన ఎంపీ.. ఈసారి ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కాషాయ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కూడగట్టాలంటే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి. అంతేకానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజల మద్దతును కూడగట్టలేం. అందులోనూ విశ్వాసాన్ని దక్కించుకోలేం. నిజామాబాద్ బీజేపీ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ తీరు అచ్చంగా ఇదే ఒరవడిలో కొనసాగుతున్నది. దుందుడుకు వైఖరితో ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోవడంతో ఏమీ చేయలేక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాడు. 2019 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకువస్తానంటూ గొప్పలు చెప్పాడు. ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల ప్రాంత రైతులను నమ్మించాడు. తీరా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు సరికదా రాసిచ్చిన బాండ్ పేపర్ ప్రకారం రాజీనామా చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేదు. ఈ పరిస్థితిని గమనిస్తున్న ప్రజలంతా అర్వింద్ను ఇప్పటికే అడుగడుగునా నిలదీస్తూ క్షేత్ర స్థాయిలో తిరగనివ్వడం లేదు. దీంతో ఈ గడ్డు పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండడంతో నైరాశ్యంలో మునిగి తేలుతున్నాడు.
రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలకు ప్రత్యారోపణలు సహజం. అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. అంతేకానీ అసంబద్ధంగా ఉండకూడదన్నది స్వతంత్ర భారతదేశంలో ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇలాంటి వాటన్నింటికీ బీజేపీ తిలోదకాలు ఇస్తూ ప్రజలను మతం, కులం మత్తులో ముంచెత్తి వారి ఆవేశాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నది. ఇందుకు బీజేపీ ఎంపీ అర్వింద్ తీరు అచ్చంగా సరిపోతుంది. ఆగస్టు 9న జరిగిన కేటీఆర్ టూర్ ద్వారా బీజేపీలో వణుకు మొదలైంది. నగర అభివృద్ధి ఆశించిన స్థాయికి మించి జరగడంతో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. హైదరాబాద్లోని మహాప్రస్థానాన్ని తలదన్నే రీతిలో ఇక్కడి వైకుంఠధామాలు ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి వచ్చాయి. మున్సిపల్ కొత్త భవనం, ట్యాంక్బండ్తో పాటు అద్భుతమైన సుందరీకరణ పనులతో నిజామాబాద్ నగరం తళుకులీనుతుండడంతో చేసిన అభివృద్ధిని ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఇందులో పైసా వాటా లేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో బూతు పురాణాలతో పబ్బం గడుపుతున్నది. కార్పొరేషన్లో బీజేపీ కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లతో సహా ఆ పార్టీ లోక్సభ సభ్యుడు సైతం వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక సెల్ఫ్ గోల్ అవుతున్న బీజేపీ నేతలంతా అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భయం పట్టుకున్నది. ఈ సారి ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడ్నుంచి పోటీ చేసినా ఓడగొట్టిస్తానంటూ కవిత చేసిన శపథం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీగా గెలిచి నాలుగేండ్లు దాటినప్పటికీ కేంద్రం నుంచి పైసా నిధులు తీసుకురాని అసమర్థుడు అర్వింద్ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి చేరుతున్నాయి. ప్రజలను నిలువునా మోసం చేసిన అర్వింద్ను ఈసారి ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తానంటూ నాలుగైదు నెలల క్రితమే ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తాజాగా మరోమారు ఇదే సవాల్ను కవిత పునరుద్ఘాటించారు. ఎంపీగా పోటీకి వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడ్నుంచి బరిలో నిలిచినా చిత్తుగా ఓడించడం ఖాయమంటూ కవిత చెప్పడంతో అర్వింద్లో భయాందోళనలు షురూ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే సవాల్ను ధైర్యంగా స్వీకరించలేక వాస్తవ దూరంగా ఆరోపణలు చేస్తూ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారంటూ ప్రజలు భావిస్తున్నారు. కవిత విసిరిన సవాల్తో ఎదురైన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్కు ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నైట్లయ్యింది. ఓ వైపు పసుపు బోర్డు హామీ నెరవేర్చలేక లోక్సభ స్థానానికి పోటీ చేయడం గగనమనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలన్నీ బీఆర్ఎస్కే ఉన్నాయి. పసుపు రైతులు, సామాన్య జనం బీజేపీ ఎంపీ తీరుకు విసుగెత్తి పోయారు. దీంతో సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న జనం బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు. వ్యక్తిగత దూషణలు తప్ప అభివృద్ధి గురించి ఏనాడూ పల్లెత్తు మాటెత్తని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై సర్వత్రా వ్యతిరేకత కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ప్రజలకు ఉపయోగపడని అబద్ధపు మాటలతో రెచ్చగొట్టుడు మినహా నిజామాబాద్, జగిత్యాల ప్రజలకు చేసిందేమిటి? అని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు.