ఖలీల్వాడి, మార్చి 16: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోఫాలు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో మసీదుకు రూ.లక్ష ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ముస్లింల వైపున ఏ పార్టీ నిలుస్తున్నదో దీన్ని బట్టి తేటతెల్లమవుతు న్నదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ జపం చేస్తున్నారని అన్నారు. తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ రెండు కూడా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే అని స్పష్టంచేశారు. దీనిని రాసిపెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్తో రేవంత్రెడ్డి ఏ రకంగానూ సరితూగరన్నారు. తమకు తెలంగాణ అంటే టాస్క్ అని, ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయమని తెలిపారు. కేసీఆర్ అంటే సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, నిద్రలో కూడా కేసీఆర్ పేరే కలవరిస్తున్నారని అన్నారు.
‘రైతుబంధు ఇవ్వను కానీ రఫ్గా మాట్లాడుతా, రుణమాఫీ చేయను కానీ బాగా రుబాబుగా మాట్లాడుతా, సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లు అన్ని చెబుతా, ఉద్యోగాలు ఇవ్వను కానీ వట్టి మాటలు చెబుతా, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వను కానీ తుఫెల్ మాటలు చెబుతాను అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. గౌరవ మర్యాదలు అనేవి కొనుక్కుంటే వచ్చేవి కావని, మన నడవడిక, మాటతీరు, పని తీరు, పేరు బట్టి ఉంటాయన్నారు.
సబ్బండ వర్ణాలను పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అబద్ధాలు చెబితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కేసీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారోనని ప్రజలు టీవీలను ఆన్ చేస్తారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడితే టీవీనీ మ్యూట్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడితే ముందుగానే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి ఏ సర్టిఫికెట్ తీసుకొని వినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపాన్ని మూట కట్టుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, రెడ్కో మాజీ చైర్మన్ అలీం, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, పార్టీ మైనార్టీ నాయకులు నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, మతీన్, జాగృతి నాయకులు అవంతి రావు, రెహాన్, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.