నవీపేట, అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఎప్పడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రానికి వచ్చిన ఆయన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు కరెంటు కోతలతో నానా గోసలు పడ్డారని గుర్తుచేశారు. స్వరాష్టంలో సీఎం కేసీఆర్ రూ. లక్ష కోట్లతో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమలు, గృహ అవసరాలకు నాణ్యమైన కరెంటును సరాఫరా చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, సకాలంలో ఎరువులు, పంటలకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించిన కేసీఆర్.. రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు.
సీఎం చేపడుతున్న బృహత్తర పథకాలను చూసి ఆర్థిక శాస్త్రవేత్తలే బిత్తరపోతున్నారని అన్నారు. తెలంగాణ బాగుకోసం కేసీఆర్ తాపత్రయ పడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం అడ్డమైన, నిరాధారమైన ఆరోపణలతో ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒక వైపు.. ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మరోవైపు ఉన్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్పై వ్యక్తి గత విమర్శలు చేస్తున్న రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కేసీఆర్.. ప్రజలకు చెప్పింది చేసి చూపించే నాయకుడని అన్నారు. ప్రతి పక్షపార్టీల నాయకులు ఎన్ని పిచ్చికూతలు కూసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. బోధన్లో మరోసారి షకీల్ గెలుపు ఖాయమని అన్నారు.