దోమకొండ/సదాశివనగర్/పిట్లం, ఏప్రిల్ 10 : లోక్సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ గాలికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొట్టుకుపోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దోమకొండ, బీబీపేట్ మండలాల కార్యకర్తల సమావేశాన్ని దోమకొండలో, సదాశివనగర్, రామారెడ్డి కార్యకర్తల సమావేశాన్ని మర్కల్లో, పిట్లం, పెద్ద కొడప్గల్ కార్యకర్తల సమావేశాన్ని పిట్లంలో బుధవారం వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదన్నారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేరన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు ప్రతినెలా రూ. 4 వేల జీవనభృతిని అందిస్తామన్న భట్టి విక్రమార్క.. ఇక తన వట్టి మాటలను కట్టిపెట్టాలని హితవు పలికారు. బీజేపీ రామనామంతో ఓట్లను దండుకోవడమే తప్ప అధికారంలోకి వచ్చి పదేండ్లు గడిచినా రాష్ర్టానికి ఇచ్చిందేమీ లేదన్నారు. పదేండ్లుగా ఎంపీగా ఉండి పది పైసల పనిచేయని వ్యక్తిగా బీబీ పాటిల్ నిలిచారని, ఎంపీగా ఉండి ఏ ఒక్క గ్రామంలో కూడా తిరగని వ్యక్తి పాటిల్ అని విమర్శించారు. పనికిరాని మొక్కలను తీసి గోదాట్లో పడేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పథకాలపై గ్రామగ్రామాన, గల్లీగల్లీలో మీటింగులు పెట్టి ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలు చెప్పాలన్నారు.
దోమకొండలో ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ర్టాన్ని నంబర్వన్ స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పిట్లంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ తనను ఆశీర్వదించి పంపించారని అన్నారు. ప్రజలు కూడా ఓటుతో ఆశీర్వదిస్తే ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. బాన్సువాడ, పిట్లం మీదుగా రైల్వేలైన్ ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయా సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదర్రాజు, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, రాష్ట్ర నాయకుడు గంప శశాంక్, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.