నందిపేట్, నవంబర్ 17: కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా? కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అన్నది ఆలోచించాలని కోరారు. ఆ రెండు పార్టీలు ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడూ ఆలోచించవని విమర్శించారు. నిత్యం ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. నందిపేట్ మండలంలో శుక్రవారం నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డితో కలిసి కవిత పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కొంతమందికే రూ.200 పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఊరిలో అర్హులందరికీ రూ.2వేల పింఛన్ను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని వివరించారు.
ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆ మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచాలని, ఐదేండ్లలో వాటిని రూ.5 వేలకు పెంచుకుంటూ వెళ్లాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో సకాలంలో ఎప్పుడూ ఎరువులు అందించలేదని, సాగు, తాగునీళ్లు ఇవ్వలేదని అలాంటి పార్టీ మనకు అవసరమా అన్నది ఆలోచించాలని కోరారు. ఎలాంటి ఆధారం లేని పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రూ.1200గా ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే సబ్సిడీ కింద ఇస్తామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్మూర్లో తన గెలుపు ఖాయమని, కాంగ్రెస్, బీజేపీలు మాయం కాక తప్పదని బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బ్యాలెట్ పేపర్లో కారుగుర్తు మొదటి నంబర్లో ఉన్నదని, ఒకటో నంబర్ ముద్దు ..ఇంకోనంబర్ వద్దని జీవన్రెడ్డి అన్నారు. మున్నూరు కాపులు అసలు సిసలైన రైతు బిడ్డలు అని, ఇది పక్కా రైతు ప్రభుత్వమని, ప్రతి పథకం మున్నూరు కాపుల ఇంటి ముంగింట్లోకే వస్తున్నదన్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి దీవించాలని జీవన్రెడ్డి కోరారు.