బోధన్/బాల్కొండ/ఆర్మూర్/నందిపేట్/ బోధన్ రూరల్, సెప్టెంబర్4: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల స్టిక్కర్లను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలను సభకు తరలించేందుకు ఆయా గ్రామాలు, మండలాల నాయకులు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, సీనియర్ నాయకుడు, రైతు బంధు సమితి మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ బోధన్ పట్టణ, మండల అధ్యక్షుడు రవీందర్ యాదవ్, గోగినేని నరేంద్రబాబు (నర్సన్న), టీఆర్ఎస్ రెంజల్ మండల అధ్యక్షుడు భూమ్రెడ్డి, బోధన్ మండల కార్యదర్శి సిర్ప సుదర్శన్ ఉన్నారు.
సీఎం సభకు వేలాదిగా తరలిరావాలి
సీఎం సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలిరావాలని నాయకులు కోరారు. కేసీఆర్ బహిరంగ సభకు బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి కోరారు. మండలంలోని 10 గ్రామాలకు చెందిన 5వేల మందిని బస్సుల్లో తరలిస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, తరలిరావాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్రెడ్డి కోరారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు.
కేసీఆర్ సభకు నందిపేట్ మండలం నుంచి ప్రజలు తరలిరావాలని ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్ కోరారు. గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు కృషి చేయాలని అనారు.
పార్టీ కండువాల పపిణీ
సీఎం కేసీఆర్ సభపై బోధన్ మండలంలోని జాడిజమాల్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. గ్రామం నుంచి ప్రజలు తరలిరావాలని కోరుతూ పార్టీ కండువాలు అందజేశారు. గ్రామ కమిటీ నాయకులు ఉన్నారు.