శక్కర్నగర్, డిసెంబర్ 29: తమ అవసరం నిమిత్తం డబ్బులు అడిగినా ఇవ్వలేదన్న కోపంతో సొంత బంధువులను కొందరు దుండగులు దాడి చేసి, హత్య చేశారని బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పోలీస్ పరిధిలోని రెండు వేర్వేరు ఘటనల్లో జరిగిన దాడి, హత్యలకు సంబంధించిన వివరాలను ఏపీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రెంజల్ మండల కేంద్రానికి చెందిన జడల వర్ధన్ అనే యువకుడు ఈనెల 23న ఉదయం తన తాత జడల నాగన్న, నానమ్మ శకుంతల రక్తం మడుగులో ఉన్నట్లు గుర్తించి రెంజల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ఎస్సై సాయన్న, రూరల్ సీఐ జి. శ్రీనివాసరాజుతో పాటు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సదరు ఘటనపై విచారణ చేపట్టారు. అయితే దంపతులకు వరుసకు కుమారుడు అయిన జడల రాజేశ్వర్ అలియాస్ రాజు అనే వ్యక్తి కొంత కాలంగా శకుంతలను తాను ఉపాధికోసం దుబాయి వెళ్తానని, డబ్బులు అప్పుగా ఇవ్వాలని పలుమార్లు గొడవపడ్డాడని వివరించారు.
డబ్బులు ఇవ్వడానికి దంపతులు నిరాకరించడంతో ఈనెల 22న రాత్రి రాజేశ్వర్ అదే గ్రామానికి చెందిన బొంకుల సాయిలుతో కలిసి దంపతులపై దాడి చేశారు. ఇరువురు అపస్మారక స్థితికి చేరగానే బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. 28న నిందితులు ఓ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వారిని ఎస్సై అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం చేసినట్లు వారు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
బోధన్ పట్టణంలోని బెల్లాల్ ఇందిరమ్మ కాలనీలో ఈ నెల 14న ఎర్రోళ్ల పోశవ్వ కుళ్లిపోయిన స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనలో నిందితులైన తల్లీ, కుమారులను అరెస్టు చేసిట్లు ఏసీపీ తెలిపారు. పోశవ్వకు దూరపు బంధువైన మల్క రవి అలియాస్ రాహుల్, తల్లి మల్క గంగామణిలు అవసర నిమిత్తం ఈ నెల 11న బెల్లాల్కు వచ్చి డబ్బులు కావాలని అడిగారు. దీంతో పోశవ్వ డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహానికి గురై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి సెల్ఫోన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
ఈ రెండు ఘటనల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి, నిందితులను పట్టుకొన్న బోధన్ పట్టణ, రూరల్ సీఐలు ప్రేమ్ కుమార్, జి. శ్రీనివాస రాజు, ఎస్సై నవీన్, సాయన్న, వర్ని ఏఎస్సై బాబూరావు, కానిస్టేబుళ్లు శివకృష్ణ, పవన్, తుకారామ్లను ఏసీపీ అభినందించారు. వీరికి పోలీసు ఉన్నతాధికారులతో త్వరలో రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.