రాష్ట్ర ప్రభుత్వం సమయానికి రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. పెట్టుబడికి రంది లేకపోవడంతో అన్నదాతలు ఉత్సాహంగా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చు కోసం వినియోగించు కుంటున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన పదో విడుత పెట్టుబడి సాయం గత నెల 28 నుంచి ప్రారంభమైంది. విడుతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పెట్టుబడి సాయం డబ్బులు తీసుకునేందుకు అన్నదాతలు తరలివస్తుండడంతో బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడుతున్నాయి. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
– బాన్సువాడ రూరల్/బీర్కూర్/బాన్సువాడ టౌన్/వేల్పూర్
రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. పదో విడుత పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం కాగా తొమ్మిదో రోజు శుక్రవారం సైతం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. డబ్బుల విత్డ్రా చేసుకునే రైతులతో బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడుతున్నాయి. యాసంగి సాగు ప్రారంభం కావడం, సమయానికి డబ్బులు చేతికందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా సాగు పనులు చేసుకుంటున్నారు. ఎలాంటి రంది లేకుండా ఎవుసం చేసుకునేలా చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులు చెబుతున్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6
బాన్సువాడ రూరల్, జనవరి 6: సీఎం కేసీఆర్ సారు నా బ్యాంకు అకౌంట్లో రైతుబంధు పైసలు జమచేసిండు. సర్కారు చేసిన పెట్టుబడి సాయంతో యాసంగి పంటలను సాఫీగా చేసుకుంటున్నాం. పెట్టుబడికి ఇబ్బందులు తప్పినయ్. సీఎం సారు సల్లగుండని.
-లక్ష్మీబాయి, రైతు, బోర్లం క్యాంపుతండా
వేల్పూర్, జనవరి 6: కేసీఆర్ ప్రతి ఏటా రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకూ పెట్టుబడి సాయాన్ని అందించడంతో సాగు ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రైతు ప్రభుత్వమని నిరూపించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
-ఏలేటి చిన్నారెడ్డి, వేల్పూర్
బాన్సువాడ రూరల్, జనవరి 6: రైతులను రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. పంట పెట్టుబడి కింద ఇస్తున్న రైతుబంధు సాయంతో రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. పంటల పెట్టుబడికి ఎలాంటి అప్పులు చేయకుండా సాగు చేసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నారు.
– రాములు, రైతు, బోర్లం.
బాన్సువాడ టౌన్, జనవరి 6: తెలంగాణ రాక మునుపు నీళ్లు, కరెంటు, పెట్టుబడికి లేక వ్యవసాయం మానేసి పని కోసం పట్టణానికి వెళ్లేవాళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలతో తిరిగి పల్లెకు వచ్చినం. రైతుల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. కేసీఆర్ దయతో మన రాష్ట్రంలో రైతే రాజు అనే స్థాయికి వచ్చినం.
– దొన్కంటి సాయవ్వ, రైతు, బాన్సువాడ
రైతు మేలు కోరే పథకం..
బాన్సువాడ టౌన్, జనవరి 6: ఒకప్పుడు వేరే వారి దగ్గర అప్పు తెచ్చి పంట వేసే వాళ్లం. కానీ, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల మేలు కోరి రైతుబంధు పథకం అమలు చేస్తున్నడు. దీంతో పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– తాటి గంగయ్య, రైతు, బాన్సువాడ
బీర్కూర్, జనవరి 6: రైతులకు ఇబ్బందులు లేకుండా రైతుబంధు పథకం ప్రవేశపెట్టిండు. రెండు పంటలకు మా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నయ్. నాకు ఉన్న నాలుగెకరాల భూమిలో పంట సాగుకు ముందే సీఎం కేసీఆర్ రూ.20వేలు వేస్తున్నడు. ఏ ఒక్క రూపాయి కూడా ఇతరుల వద్ద చేయి చాచకుండా వ్యవసాయం చేస్తున్నాను.
– ఇంగు శ్రీనివాస్, రైతు, బీర్కూర్
బీర్కూర్, జనవరి 6: తెలంగాణ ఏర్పాటుకు ముందు పంటలు సాగు చేయాలంటే తప్పనిసరిగా ఇతరుల వద్ద, వడ్డీ వ్యాపారుల వద్ద చేయిచాచే వాళ్లం. స్వరాష్ట్రంలో యేడాదిలో రెండు పంటలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న రైతుబంధు పథకంతో ఆ ఇబ్బంది తప్పింది. పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద చేయిచాచే పరిస్థితి పోయింది.
– ధనుంజయ్, రైతు, సంభాపూర్