వేల్పూర్/మోర్తాడ్(కమ్మర్పల్లి)/భీమ్గల్, ఏప్రిల్ 28 : అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అడ్రస్, ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడా అని బీజేపీ అభ్యర్థి అర్వింద్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ హామీలను అమలుచేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, మోర్తాడ్, భీమ్గల్ మండల కేంద్రాల్లో బాజిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి ఆదివారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చిన అర్వింద్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ తీసుకురాలేదన్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ ఎందుకు ఓటు వేయాలో ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడు పసుపు బోర్డు సాధించానని చెబుతున్నాడని, బోర్డు ఆఫీస్, మెయిన్ దర్వాజ, ఆయన కుర్చీ ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు. ఈసారి పసుపు పంట భారీగా సాగు తగ్గడంతోనే ధర పెరిగిందని ఇందులో బీజేపీ ఘనకార్యం ఏమీలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఏనాడు ఇక్కడి ప్రాంత ప్రజల మంచీ చెడుకు రాలేదన్నారు. ఐదేండ్లుగా ఎంపీగా ఉన్న అర్వింద్ అభివృద్ధి పనుల కోసం ఏ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభివృద్ధి పనుల కోసం ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలన్నీ బోగసని, ఓట్లకోసం ఇచ్చినవని, అవి పనులు చేపట్టడానికి కాదం టూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ కాపీలను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపిద్దామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదం పొందినవి కాదని కలెక్టర్ చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిజమైనవని తేలితే పనులు జరిగేలా చూడాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని, మంజూరైన పనులను జరగకుండా చూస్తున్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. మోచేతికి బెల్లం పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, మరోసారి మోసపోతే గోస పడక తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నా రు. ఈరెండు పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని కోరారు. బాజిరెడ్డి 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటారని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను సాధించడమే కాకుండా పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట గలుపుతుందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించి, బాజిరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మళ్లీ అబద్ధాలు చెప్పడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకు వస్తున్నారని, వారిచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. రూ.4వేల పింఛన్, రుణమాఫీ, తులం బంగారం, సీఎంఆర్ఎఫ్, రైతుబంధు పథకాల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తే సమాధానం చెప్పలేక పారిపోతారన్నారు. అబద్ధ్దాలు చెప్పే విషయంలో మోదీ బడా ఝూటా.. అర్వింద్ చోటా ఝూటా అని, రేవంత్రెడ్డి కేడీ అని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఒక్కసారైనా జై తెలంగాణ అన్నాడా …అనడు ఎందుకంటే తెలంగాణ ద్రోహి అని అన్నారు. తనను గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి పసుపుబోర్డు తీసుకువస్తానన్నారు. ప్రచారంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు