నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఒంటెద్దు పోకడ బీజేపీలో చిచ్చు రాజేసింది. కాషాయ శిబిరంలో రేగిన అసమ్మతి సెగ విస్తృతమవుతున్నది. అర్వింద్కు వ్యతిరేకంగా మొన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ధర్నాకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు తాజాగా సోమవారం జిల్లా ఆఫీసు ఎదుట బైఠాయించారు. ఐదు నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చి అర్వింద్ డౌన్డౌన్, పార్టీ నుంచి తొలగించాలనే నినాదాలతో హోరెత్తించారు. అర్వింద్ను బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘20, 30 ఏండ్ల సంది జెండా మోస్తున్నాం. పార్టీని నమ్ముకుని బతుకున్నం. ప్రజల్లో పార్టీకి ఉనికి లేకున్నా జెండాను పట్టుకుని వేలాడుతున్నం. అయినప్పటికీ మాకు గుర్తింపు లేదా. అర్వింద్ కన్నా మేమే బీజేపీలో సీనియర్లం. అర్వింద్ కేవలం తన స్వార్థం కోసం తన తండ్రి మాటున కాంగ్రెస్ జెండాలు మోసి 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చిండు. అబద్ధాలు చెప్పి, అసత్య ఆరోపణలు, అమలు చేయడానికి వీలులేని హామీలతో గద్దెనెక్కిండు. ఆయన గెలుపులో మాలాంటోళ్ల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు మమ్ములను పట్టించుకుంటలేడు. కనీసం మా మండలంలో పార్టీ పదవుల నియామకాల్లోనూ మా జోక్యాన్ని తొలగించడం ఏంది? నిన్న కాక మొన్న బీజేపీకి వచ్చినోడికి మా బాధలు ఏం తెలుస్తయి. అర్వింద్ రాకముందు మా జాగలా మేమున్నం. మమ్ములను ఎవ్వడూ డిస్టర్బ్ చేయలే. వీడు వచ్చిన తర్వాత కొత్త వాళ్లకే ప్రయారిటీ పెరిగింది. అర్వింద్ను పార్టీ నుంచి బహిష్కరించాలి. లేదంటే ఉద్యమం మరింత పెద్దగా చేస్తాం. బీజేపీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అర్వింద్ను మేమే వచ్చే ఎన్నికల్లో బొంద పెడతాం.’ ఇదీ నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టిన ధర్నా సందర్భంగా కాషాయ పార్టీకి చెందిన నాయకుల ఆగ్రహావేశాలు.
కొంత కాలంగా ఒంటెద్దు పోకడలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అర్వింద్ తీరును ఎండగడుతూ బీజేపీ నాయకులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.
పెరుగుతున్న అసంతృప్తవాదులు…
‘అర్వింద్… డౌన్ డౌన్, ఎంపీ అర్వింద్ వైఖరి నశించాలి. ఒంటెద్దు పోకడలు నశించాలి…’ అంటూ నినాదాలు ఇచ్చింది ఎవరో బీజేపేతర పార్టీ నాయకులు అనుకుంటే మీరు పొరబడినట్లే. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే వందలాది మంది కాషాయ కార్యకర్తలు నినదించిన నినాదాలివీ. అది కూడా ఎక్కడో రోడ్లపైనో, ఇంకోచోట కూడా కాదండోయ్… సాక్షాత్తు వారి పార్టీ జిల్లా కార్యాలయం ముందే ధర్నా నిర్వహించి బీజేపీ ఎంపీ తీరునే తప్పుబట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మొన్నటికి మొన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన వారంతా ఎంపీ తీరును వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదు కూడా అందించారు. ఎంతకూ రాష్ట్ర నాయకత్వంలో చలనం లేకపోవడంతో రెండు నియోజకవర్గాల్లో మొదలైన అర్వింద్ వ్యతిరేక సెగ కాస్త ఐదు నియోజకవర్గాలకు పాకింది.
అంతా కలిసి సోమవారం నిజామాబాద్ బీజేపీ కార్యాలయం ముందే ధర్నా చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. స్వార్థ రాజకీయం కోసం పని చేసే అర్వింద్ లాంటి వ్యక్తుల బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం చర్చనీయాంశం అవుతున్నది. అర్వింద్ తీరుతో జిల్లాలో బీజేపీ నాయకులకు ముఖం లేకుండా పోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధన్, ఆర్మూర్తో మొదలైన నిరసన పర్వం 5 నియోజకవర్గాలకు పాకడంతో బీజేపీ రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
అర్వింద్ది కాంగ్రెస్ రక్తం…
బీజేపీ నేతల ఆందోళనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. బీజేపీ ఎంపీపై పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో అసంతృప్త నేతలంతా తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల ముందు వరకు ధర్మపురి అర్వింద్ది కాంగ్రెస్ రక్తమని ఆరోపించారు. ఆయనకు బీజేపీ సిద్ధాంతాలే తెలియవంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎజెండా ఏంటో అర్థం తెలియనోడి చేతి కింద మాలాంటోళ్లం పని చేయడం దౌర్భగ్యమంటూ మథనపడ్డారు. అర్వింద్కు పార్టీ నిర్ణయాల కన్నా తన తండ్రి డీఎస్ అనుచరులు, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అందుకే పాత బీజేపీ నాయకులను కాదని 13 మండలాల్లో తనకు ఇష్టమైన వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న బీజేపీ నేతలకు పదవులు కట్టబెట్టారని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదంటూ కేంద్ర మంత్రిపైనా ఇందూర్ శాఖ నేతలు గుస్సా అవుతున్నారు. కిషన్ రెడ్డి స్పందించకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేసి అర్వింద్ను అడుగడుగునా అడ్డుకుంటామంటూ చెబుతున్నారు. అర్వింద్ లేకపోతేనే బీజేపీ ప్రశాంతంగా ఉందని, ఆయనొచ్చిన తర్వాతనే గ్రూపుల లొల్లి జరుగుతున్నదంటూ మండిపడుతున్నారు.
ఇంటా బయటా మద్దతు లేక…
ఇప్పటికే పసుపు బోర్డు హామీని నెరవేర్చలేక, రాసిచ్చిన బాండ్ పేపర్ హామీని నిలబెట్టుకోలేక నైతికతను కోల్పోయిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. తాజాగా సొంత పార్టీలోనే ఇంటి పోరుతో కాషాయ కార్యకర్తల్లోనూ నమ్మకాన్ని కోల్పోయాడు. రైతులు, ప్రజలంతా ఎంపీని వెంటాడుతూ, నిరసనలు వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇంటి పోరు అర్వింద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఢిల్లీ, హైదరాబాద్లో తిష్ట వేసుకుని నిత్యం సోషల్ మీడియాలో తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేసే అర్వింద్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక పిల్ల మాదిరిగా మారిందన్నట్లుగా రాజకీయ విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ అర్వింద్పై పోరుబాటను ఎంతదాకైనా వెళ్లేందుకు సిద్ధమేనని అసంతృప్తవాదులంతా చెబుతున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులకు అర్వింద్ బాగోతంపై ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి కుమారుడితో ఉన్న సాన్నిహిత్యాన్ని చూపుతూ బీజేపీ నేతలను బెదిరిస్తున్న వైనంపైనా ఫిర్యాదులు చేయనున్నట్లు తెలుస్తోంది. సొంత జిల్లాలో, బీజేపీ నేతలే వందలాది మందిగా స్వచ్ఛందంగా తరలి వచ్చి అర్వింద్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండడంతో బీజేపీ గ్రాఫ్ పాతాళంలోకి కూరుకుపోయింది. దీంతో బీజేపీలో పని చేస్తున్న వారంతా పక్క పార్టీల వైపు మళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాషాయ జెండాను వదిలేయాలనే ఆలోచనలు సైతం చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నిజామాబాద్ నగరంలోని చాలా మంది కార్పొరేటర్లు బీజేపీ ఎంపీ తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్లో చేరడాన్ని గుర్తు చేసుకుంటున్నారు.