వినాయక్నగర్, మార్చి 5: నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి అర్వింద్ ధర్మపురిపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన సెగ తగులుతున్నది. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి. తాజాగా సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్ దంపతులు.. అర్వింద్ తీరుపై దుమ్మెత్తిపోశారు. అహంకారి, దుర్ముర్గుడు, కాషాయం కప్పుకున్న కసాయి అర్వింద్.. లోక్సభ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని ధ్వజమెత్తారు. అతడికి టికెట్ ఇచ్చి బీజేపీ తప్పు చేసిందని, అర్వింద్ను పోటీ తప్పించాలని ఆ పార్టీ సీనియర్ నేత మీసాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, నిజామాబాద్ 19వ డివిజన్ కార్పొరేటర్ సవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు వా రు ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని రాష్ట్ర పార్టీ నేతలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు.
అర్వింద్ ఎవరికీ అందుబాటులో ఉండడని, పార్టీ నేతలతో పాటు ప్రజలను సైతం చులకనగా చూస్తాడని విమర్శించారు. నిజామాబాద్లోని 17 లక్షల మంది అర్వింద్ బా ధితులని, ఓటర్ల కోరిక మేరకు బీజేపీ అభ్యర్థిని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అర్వింద్కు దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా నిజామాబాద్లో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. పార్లమెంట్లో ఇంత టెంపర్ ఉన్న వ్యక్తి మరొకరు లేరని, అలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇచ్చి బీజేపీ తప్పు చేసిందన్నారు. ఆయనకు బదులు డేరాబాబా, నిత్యానందకు టికెట్ ఇచ్చినా తాము ఢిల్లీ వరకు వచ్చే వాళ్లం కాదని తెలిపారు. అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర నాయకత్వం సరైన నుంచి సమాధానం రాకపోవడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. మోదీ, అమిత్షా సహా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చామని చెప్పారు. ప్రజల అభిప్రాయాల మేరకు అర్వింద్ను మార్చాలని, అతడికే టికెట్ ఇస్తే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు.
అర్వింద్కు వ్యతిరేకంగా గళమెత్తిన సీనియర్ నేత శ్రీనివాసరావు, కార్పొరేటర్ సవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని సూచించారు.