కోటగిరి, డిసెంబరు 29: గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరందించి, ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేందుకు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.42వేల కోట్లు వెచ్చించి చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారులు, సర్పంచుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలేదని మండిపడ్డారు. వర్ని మండల కేంద్రంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం గురువారం నిర్వహించగా.. స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తమ నివేదికను వినిపించేందుకు వేదిక వద్దకు రాగానే.. వారిపై సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ముఖ్యమంత్రి లక్ష్యం నీరుగారిపోతున్నదన్నారు. అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీరు వంద శాతం సరఫరా అవుతున్నట్లు కాకి లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సి ఉండగా.. వర్ని మండలంలో కేవలం నాలుగు గ్రామాల్లో మాత్రమే అందుతున్నాయన్నారు .
రాష్ట్రంలో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రూ. 42వేల కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ పథకం.. అధికారులు, సర్పంచుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం చేరుకోవడంలేదన్నారు. ప్రజలకు సరిపడా తాగునీరు అందించేందుకు సింగూరులో నీరు పుష్కలంగా ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు రూ.రెండు వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి ప్రధాన కారణం తాగునీరేనన్నారు. నెల రోజుల్లోగా నీటి సరఫరాను మెరుగు పరచాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటానని ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్, ఏఈలను హెచ్చరించారు.
నిజాంసాగర్ నీటిని మరో మూడురోజులు విడుదల చేయాలి
రైతుల అవసరాల నిమిత్తం నిజాంసాగర్ నీటిని మరో మూడు రోజుల పాటు విడుదల చేయాలని సాగునీటి పారుదల శాఖ అధికారులకు స్పీకర్ సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయించానని, మరిన్ని ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. త్వరలో ఇంటి నిర్మాణానికి రూ. మూడు లక్షలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామా ల్లో రోడ్లపై ప్రమాదాలు జరుగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్బీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని సర్పంచులు, అధికారులకు సూచించారు.
జాకోరా ఎత్తి పోతల పనులను వేగవంతం చేస్తూ, కాలువ పనులను కొనసాగించాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారికి అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఆకస్మిక తనిఖీల ద్వారా తెలుసుకోవాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నదని చెప్పి, అవగాహన కల్పించారు. సమావేశంలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, ఏఎంసీ చైర్పర్సన్ మూడ్ కవిత, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో బషీరుద్దీన్, ఐసీడీఎస్ అధికారిణి వినోద, ఎంఈవో శాంతాకుమారి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.