బాన్సువాడ టౌన్, జనవరి 30: తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను లబ్ధిదారులు ఖండించారు. ఈ మేరకు వారు సోమవారం మీడియాతో మాట్లాడారు.
పట్టణంలోని పలు వార్డులకు చెందిన తాము సొంతిల్లు లేకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం అధికారులకు ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. దీంతో ఆర్డీవో, తహసీల్దార్తోపాటు పలువురు అధికారులు పలుమార్లు సర్వేచేపట్టి, తాము అర్హులమని ధ్రువీకరించిన తరువాతే డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి లోటుపాట్లు జరగలేదన్నారు. సర్వే ప్రక్రియ నుంచి పంపిణీ వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదన్నారు.
ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి అర్హులకు ఇండ్లను పంపిణీ చేశారని తెలిపారు. సొంతింటి కల నెరవేరుతుందని అనుకోలేదని, సీఎం కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దేవుళ్ల రూపంలో వచ్చి తమకు గూడు కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఇంటితోపాటు అన్ని రకాల సదుపాయాలను కల్పించారని తెలిపారు. ఇంతగొప్ప కార్యాన్ని తలపెట్టినవారిపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కొందరు నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం అనర్హులను ముందు ఉంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే స్పీకర్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు ఓపిక వహించాలని కోరారు. రాక్షస ఆనందం కోసం కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని సూచించారు.