కామారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి జిల్లాలో బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నది. కామారెడ్డి సెగ్మెంట్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా, నేడు ఆర్థికసాయం అందించనున్నారు. మిగతా సెగ్మెంట్లలో కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు.
బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 300 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాకు రూ.11.20కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కామారెడ్డి నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. త్వరలో తేదీలను ఖరారు చేసి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెక్కులను అందజేయనున్నారు.
సమైక్య పాలనలో ఆదుకునే వారే కరువు
సమైక్య రాష్ట్రంలో కులవృత్తిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. రెక్కాడితే గాని డొక్కాడని వీరికి ఆర్థిక సహాయం అందించేవారే కరువయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ఆధునిక యంత్రాల రాకతో కులవృత్తిదారుల పనులకు ఆదరణ లేక తీవ్ర కష్టాల పాలవుతున్నారు. స్వరాష్ట్రంలో వారి కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా వివిధ రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకున్నారు. వెనుకబడిన వర్గాల్లో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన పథకమే లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. గత జూన్ నెల 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా, జిల్లా వ్యాప్తంగా 17,282 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తులు వచ్చాయి.
దశాబ్ది ఉత్సవాల్లో 32 మందికి చెక్కుల అందజేత
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ నెల 9న తెలంగాణ సంక్షేమ సంబురాల్లో 32 మందికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ 10 మంది లబ్ధిదారులకు, బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 10 మందికి, జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే 9 మందికి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజాల సురేందర్ ఆరుగురికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. దీంతో లబ్ధిదారుల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమకు ప్రభుత్వం లక్ష సహాయం చేయడంతో వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర్థిక పరిపుష్టిని సాధిస్తామని వారు పేర్కొంటున్నారు. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అంటే రజక, నాయిబ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, శాలివాహన, కుమ్మరి, మేదరి తదదితర కులవృత్తిదారులు అర్హులు కావడంతో దాదాపు అందరూ దరఖాస్తు చేసుకున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు జాబితాను సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ జిల్లా స్థాయిలో ఎంపిక పూర్తి చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా ఆమోదం పొందిన తర్వాత తుది జాబితాను తయారు చేశారు. ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సహాయం పొందిన నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.