నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో సరిగా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేవంత్రెడ్డి తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగానే తన ఆటో నడవడం లేదని.. పొట్ట, బట్టకు కష్టంగా మారిందని తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బుధవారం నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆటోవాలాల దుర్భర జీవితాలను కళ్లను కట్టింది.
వినాయక్ నగర్, మార్చి 13: ‘మహిళలకు ఉచిత బస్సు పథకం’ ఆటోవాలాలకు శాపంగా మారింది. ఆటోను నమ్ముకుని పొట్ట పోసుకుంటున్న కుటుంబాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఉపాధి దూరమై, బతుకు భారమై ఆటోడ్రైవర్ల జీవనం దుర్భరంగా తయారైంది. దీంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రేవంత్రెడ్డి తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో తన ఆటో నడవడం లేదన్న మనస్తాపంతోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు వ్యక్తి తన సెల్ఫోన్లో చేసిన వాయిస్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోడ్రైవర్లను ఏ విధంగా దెబ్బతీసిందన్న అంశం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది.
నగరంలోని ఖిల్లా సమీపంలో గల కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన గోర్మిల స్వామి (45)కి భార్య దేవలక్ష్మి (40), కుమారుడు మల్లికార్జున్ ఉన్నారు. కుమారుడు డిచ్పల్లి మండలం బీబీపూర్ తండాలో గల మోడల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఆనందంగా జీవిస్తున్న స్వామికి.. కాంగ్రెస్ తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం శరాఘాతంగా మారింది. మూడు నెలలుగా ఆటోలు సరిగా నడవక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆటో కొనేందుకు తెచ్చిన అప్పుకు సంబంధించిన కిస్తీలు కట్టే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా వేదనకు గురయ్యాడు.
కుటుంబం గడవడమే కష్టంగా మారడంతో స్వామి బుధవారం తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను గొంతు పిసికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలేమిటో అంతకు ముందే తన ఫోన్లో వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టాడు. ఇంటర్ పరీక్షలు పూర్తికావడంతో ఇంటికి వచ్చిన కుమారుడు మల్లికార్జున్ తలుపులకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీలోంచి చూడగా తల్లిదండ్రులు నిర్జీవంగా కనిపించారు. దీంతో కుప్పకూలిపోయిన బాబు ఏడుపులు విని స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులు సమాచారమిచ్చారు. సీఐ సతీశ్కుమార్, పోలీసులు వచ్చి వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయిన మల్లికార్జున్ గుండెలవిసేలా రోదించాడు. ఇది చూసిన స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతోని తన ఆటో నడవడం లేదని స్వామి మరణ వాంగ్మూలంలో వెల్లడించాడు. ‘నా ఆటో నడుస్తలేదు. రేవంత్రెడ్డి తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతోని ఆటో నడుస్తలేదు. ఆ మనస్తాపంతోనే చచ్చిపోతున్నానని’ వాయిస్ రికార్డింగ్లో పేర్కొన్నాడు. ఎంత మంచిగా అయిదామన్నా అయిత లేదని ఆవేదనకు గురయ్యాడు.
‘నా భార్య నా కష్టసుఖాలలో పాలు పంచుకుంది. భర్త లేని ఆడదాని జీవితం వ్యర్థం. అందుకే ఆమెను ఒక్కదాన్ని విడిచి వెళ్లలేక ఆలోచించి, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న. నా భార్యను నేనే చేతులారా చంపుకున్న. ఇందులో ఎవ్వరి ఒత్తిడి లేదని’ స్వామి తెలిపాడు. ‘నా కొడుకు మల్లికార్జున్ ఇప్పుడు ఒంటరి వాడైండు. వాడ్ని జాగ్రత్తగా చూస్కోండి. అత్త, మామ, అక్క, పిల్లలు వాడ్ని జాగ్రత్తగా కాపాడుండ్రి. సుధా చెల్లె. నన్ను క్షమించు. మీ వదినను కూడా నేనే తీసుకెళ్తున్న. నా కొడుకును మంచిగా చూడు చెల్లె’ అని వాయిస్ రికార్డింగ్లో పేర్కొన్నాడు.
బలవన్మరణానికి ముందు స్వామి తన కుమారుడితో మాట్లాడాలని తపించాడు. ఉదయం నుంచి తన కుమారుడి ఫోన్ కోసం ఎదురుచూసినట్లు రికార్డింగ్లో పేర్కొన్నాడు. ‘నన్ను క్షమించు నాన్న. నీ ఫోన్ కోసం ఇయ్యాల పొద్దుగాల నుంచి చూస్తున్న. ఎగ్జామ్ అయినంక అయిన ఎవరి ఫోన్తోనైన చేస్తావని చూసిన. ఫోన్ చేయకపోతివి. జాగ్రత్త నాన్న’ అని స్వామి అన్న మాటలు విన్న వారిని కంటతడి పెట్టించాయి. తమ చావు, దినాలకు ఎవరి దగ్గర చందాలు వసూలు చేయొద్దని, తన భార్య నగలు అమ్మి అంత్యక్రియలు చేయాలని స్వామి కోరాడు. మా ఇద్దరికి శవాలను ఒకటే స్వర్గరథంలో తీసుకెళ్లాలని, కుమారుడితోనే తలకొరివి పెట్టించాలని పేర్కొన్నాడు.
తన కొడుకు ఎవరి దగ్గర ఉంటానంటే వారి దగ్గర ఉంచుకుని పోషించాలని, ఇందుకోసం అవసరమైతే తన ప్లాట్ను తీసుకోవాలని తెలిపాడు. మూడు నెలలుగా ఆటో నడువక స్వామి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆయన బావమరిది మధు తెలిపారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే వాడని, కానీ ఉచిత బస్సు కారణంగా ఉపాధి దూరమైందన్నారు. ఈ విషయం గురించి ఎన్నోసార్లు తనకు చెప్పి బాధ పడ్డాడని మధు వివరించారు. పొట్ట, బట్టకు కష్టమైతుందన్న బాధతోని అక్క, బావలు మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. స్వామి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.